అనంతపురంలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్టు,రూ.21 లక్షలు స్వాధీనం
అనంతపురం: అనంతపురం కేంద్రంగా క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న మరో ముఠా పోలీసులకు పట్టుబడింది. గతంలో అనంతపురం జిల్లా పుట్టపర్తి బెట్టింగ్ కు అడ్డాగా మారడంతో పోలీసులు నిఘా తీవ్రతరం చేశారు. దీంతో కొంతకాలం సద్దుమణిగిన బెట్టింగ్ హడావుడి ప్రస్తుతం ఐపిఎల్ జరుగుతుండటంతో మళ్లీ జోరందుకుంది.
తాజాగా అనంతపురం పట్టణంలోని సివిఆర్ హోటల్ కేంద్రంగా చేసుకొని క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ఏడుగురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.21లక్షలు, 13 ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీరు అనంతపురం, హైదరాబాద్, బెంగళూరుల్లో నెట్ వర్క్ ఏర్పరుచుకొని బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిసింది. అనంతపురం కేంద్రంగా శివారెడ్డి, హైదరాబాద్ కేంద్రంగా గుమ్మడి రామాంజనేయులు, బెంగుళూరు కేంద్రంగా కత్తి ప్రసాద్ క్రికెట్ బెట్టింగ్ఆర్గనైజర్లుగావ్యవహరిస్తున్నట్లు అనంతపురం నగర డీఎస్పీ వెంకటరావు తెలిపారు.
గత నెలలో అనంతపురంలో బెట్టింగ్ కు పాల్పడుతున్న ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి నుంచి రూ.30 లక్షలు స్వాధీనం చేసుకున్న విషయాన్ని డిఎస్పీ గుర్తు చేశారు. కేవలం 40 రోజుల వ్యవధిలోనే క్రికెట్ బెట్టింగ్ కు సంబంధించి ఒక్క అనంతపురంలోనే అర కోటి నగదు పట్టుబడటం సంచలనం సృష్టిస్తోంది. వీరితో బెట్టింగ్ లో పాల్గొంటూ పోలీసుల దాడి గురించి తెలిసి పరారీలో ఉన్న మరికొందరి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నట్లు డిఎస్పీ వెల్లడించారు.