విశాఖ:గంజాయి స్మగ్లింగ్ తో సంబంధం ఉన్న ఎక్సైజ్ అధికారుల అరెస్ట్
విశాఖపట్టణం:కంచే చేను మేయడం అంటే ఏంటో ఈ ఎక్సైజ్ అధికారులను చూసి తెలుసుకోవచ్చు...గంజాయి అక్రమ రవాణాను అరికట్టాల్సిన వీళ్లే ఆ అక్రమ దందాకు సహకరించడమే కాదు ఏకంగా తామే గంజాయి వ్యాపారంలో మునిగితేలారు...చివరకు ఈ వ్యవహారం ఎలాగో వెలుగుచూడటంతో పరారయ్యారు.
ఇంతకీ ఇంతటి ఘనకార్యం చేసిన ఆ ఎక్సైజ్ ఉద్యోగులు ఎవరంటే...గాజువాక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎం.రవీంద్రప్రసాద్, అతనికి సహకరించిన ఎక్సైజ్ హెడ్ కానిస్టేబుల్ వర్మ, కానిస్టేబుల్ మోహనరావు. అయితే ఎట్టకేలకు బుధవారం చోడవరం సీఐ ఎం.శ్రీనివాసరావు వీరి ముగ్గురినీ అరెస్టు చేశారు. వీరి నుంచి గంజాయి అక్రమ రవాణా సమాచారం రాబట్టారు. అనంతరం చోడవరం కోర్టులో న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు నిందితులను 15 రోజుల రిమాండ్ నిమిత్తం విశాఖ సెంట్రల్ జైలుకు తరలించారు.
గంజాయి దందా...బైటపడిందిలా...
2017 సంవత్సరం మే 29 తేదీన ఒక ప్రైవేటు వాహనం క్యాబేజీ లోడుతో హుకుంపేట నుంచి పినకోట, దేవరాపల్లి మీదుగా అనకాపల్లికి వెళుతోంది. దానిని తమకు అందిన ముందస్తు సమాచారంతో పోలీసుల దేవరాపల్లి సమీపంలో తనిఖీ చేశారు. ఆ క్యాబేజీల కింద గోతాల్లో గంజాయి ఉంది. ఇలా గంజాయిని అక్రమంగా రవాణా చేస్తున్న పాత్రధారుల్లో ఇద్దరు దొరకగా, మరొకరు పరారయ్యారు.
తప్పించుకున్నాడు...కానీ మళ్లీ దొరికాడు...
అలా దేవరాపల్లి వద్ద పోలీసుల నుంచి తప్పించుకున్న గంజాయి స్మగ్లర్ ఆ తరువాత కొద్ది రోజులకే పశ్చిమ గోదావరి జిల్లాలో పోలీసులకు దొరికాడు. అతడిని గంజాయి వ్యాపారి చంద్రగా గుర్తించిన పోలీసులు అతడిని పూర్తి స్థాయిలో విచారించారు. ఆ తరువాత అతడు ఇచ్చిన సమాచారంతో అతడికి గాజువాక అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీంద్ర ప్రసాద్తో గంజాయి అక్రమ రవాణాకు సంబంధించి నేరుగా సంబంధాలు ఉన్నట్టు తేలింది.
బైటపడటంతో...అజ్ఞాతంలోకి
ఈ విషయం అప్పట్లో ఎక్సైజ్ శాఖలో సంచలనం సృష్టించింది. తన గంజాయి దందా విషయం బయటపడటంతో ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవీంద్ర ప్రసాద్ సెలవు పెట్టి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దీంతో ఈ వ్యవహారంపై పోలీసులు మరింత లోతుగా విచారణ జరిపారు. మరోవైపు ఎక్సైజ్ శాఖా కమీషనర్ కూడా మొత్తం వ్యవహారంపై శాఖాపరమైన విచారణ జరిపారు.
సంబంధాలు...స్పష్టమయ్యాయి...
ఈ విచారణలో గంజాయి అక్రమ రవాణాదారులతో, ఎక్సైజ్ శాఖా సిబ్బందికి ఉన్న సంబంధాలు స్పష్టమయ్యాయి. దీంతో గత ఏడాది నవంబర్లోనే రవీంద్ర ప్రసాద్ను, అతనికి సహకరించిన కానిస్టేబుల్ మోహనరావు, హెడ్ కానిస్టేబుల్ వర్మలను ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఆ క్రమంలోనే గంజాయి పట్టుబడింది దేవరాపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో కావడంతో అప్పట్లో దేవరాపల్లి పోలీస్ స్టేషన్ లో వీరిపై కేసు నమోదైంది.