ఎయిడ్స్ను దాచిపెట్టి పెళ్లి: శోభనాన్ని అడ్డుకున్న పోలీసులు
ఏలూరు: హెచ్ఐవీతో బాధపడుతున్న ఓ వ్యక్తి తన వ్యాధిని దాచిపెట్టి ఒక అమాయకురాలిని పెళ్లి చేసుకుని శోభనానికి సిద్ధపడ్డాడు. ఆ సమాచారం అందుకున్న జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి పోలీసులు అడ్డుకున్న సంఘటన పశ్చిమ గోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే... జిల్లాలోని పెనుమంట్ర మండలం నాగళ్లదిబ్బకు చెందిన యువకుడు (23) కొంతకాలం క్రితం గల్ఫ్ వెళ్లేందుకు ప్రయత్నించగా ఆ సమయంలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో అతడికి ఎయిడ్స్ ఉన్నట్లు నిర్ధారణ అయింది.
Also Read: సెల్ఫీ పిచ్చితో డాల్ఫిన్ ప్రాణం తీశారు(వీడియో)
దీంతో విదేశాలకు వెళ్లడానికి అవకాశం లేకుండా పోయింది. దీంతో వాస్తవాన్ని దాచిపెట్టి సోమరాజు చెరువు గ్రామానికి చెందిన ఒక యువతిని ఈ నెల 16వ తేదీన పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు. వారిద్దరికీ ఈ నెల 18వ తేదీన (గురువారం)శోభనానికి ముహూర్తం పెట్టారు.
అయితే అతడికి ఎయిడ్స్ ఉందని జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ పీడీ జీ. చంద్రశేఖరరావుకు ఒక గుర్తు తెలియని వ్యక్తి సమాచారం ఇచ్చాడు. దీంతో మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులు పెనుగొండ పోలీసులకు సమాచారం అందించి, హుటాహుటిన గ్రామానికి చేరుకుని పోలీసులు సహకారంతో ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
శోభనాన్ని అడ్డుకుని నూతన వధువును కాపాడారు. తాను ఎయిడ్స్తో బాధపడుతున్న విషయం వాస్తవమేనని అంగీకరించాడు. దీంతో ఆ పెళ్లిన రద్దు చేయడానికి ఇరు వర్గాల పెద్దలూ అంగీకరించారు. దీంతో అసలు విషయం తెలుసుకున్న వధువు బంధువులు అధికారులు, పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు.