గరగపర్రు కేసులో పోలీస్ యాక్షన్: ముగ్గురి అరెస్టు.. కొనసాగుతున్న 144సెక్షన్!
గరగపర్రులో దళితులపై వెలివేత ఘటనలో బలరామకృష్ణంరాజే సూత్రధారి అన్న ఆరోపణలు ఉండటంతో.. అతనితో పాటు మదునూరి రామరాజు, గుట్టుకుప్పల శ్రీనివాస్ అనే మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు.
ఏలూరు: అంబేడ్కర్ విగ్రహం పెట్టుకున్నారన్న కారణంగా దళితులను వెలివేసిన ఘటనలో పోలీస్ యాక్షన్ మొదలైంది. ఈ ఘటనలో ఆధిపత్య వర్గాలకే కొమ్ము కాస్తున్నారన్న విమర్శలు ఎదుర్కొన్న పోలీసులు.. తాజాగా ముగ్గురు బాధ్యులను అరెస్టు చేయడం ద్వారా బాధితులకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు.
గరగపర్రులో దళితులపై వెలివేత ఘటనలో బలరామకృష్ణంరాజే సూత్రధారి అన్న ఆరోపణలు ఉండటంతో.. అతనితో పాటు మదునూరి రామరాజు, గుట్టుకుప్పల శ్రీనివాస్ అనే మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. గ్రామంలో ఇప్పటికీ 144సెక్షన్ కొనసాగుతూనే ఉంది. మరోవైపు ఘటనపై నోరు మెదపడం లేదన్న విమర్శలు ఎదుర్కొంటున్న జగన్.. ప్రత్యక్షంగా రంగంలోకి దిగేందుకు సిద్దమయ్యారు.
జగన్, పవన్కు వాళ్ల బాధ కనిపించదా?: గరగపర్రు వెలివేతపై మౌనమెందుకు?..
జూన్ 30, జూలై 1వ తేదీల్లో జగన్ గరగపర్రు ఎస్సీ కాలనీలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా సాంఘీక బహిష్కరణకు గురైన దళిత కుటుంబాలను ఆయన పరామర్శిస్తారు. ఇక కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం సైతం గురువారం గరగపర్రులో పర్యటించారు. దళితులను సాంఘీక బహిష్కరణ చేయడం దారుణమని, వారికి న్యాయం జరిగేవరకు పోరాడుతామని అన్నారు. బాధితులైన ప్రతీ దళిత కుటుంబానికి రెండెకరాల భూమిని కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.