పనికొస్తామని ఆధార్ కార్డులు చూపిస్తారు...అడ్వాన్స్లతో మాయం అవుతారు
గుంటూరు జిల్లా: తేలిగ్గా డబ్బు సంపాదించేందుకు మాయగాళ్లు రకరకాల మోసాలకు పాల్పడుతున్నారు...కొత్త కొత్త ఐడియాలతో జనాలకు బురిడీ కొట్టించి అడ్డదారిలో సొమ్ము సంపాదిస్తున్నారు. అలా నమ్మించి మోసం చేస్తూ లక్షలు గడిస్తున్న ఒక వెరైటీ ఛీటింగ్ గ్యాంగ్ ను గుంటూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు.
పొట్ట కూటి కోసం పని కావాలంటూ వస్తారు...నమ్మకం కోసం తమ వద్ద ఉన్న ఆధార్ కార్డులు చూపిస్తారు...కావాటంటే ఎవరినైనా కనుక్కోమంటారు...ఆ తరువాత పని కోసమని అడ్వాన్స్ తీసుకుంటారు...ఆ తర్వాత రోజే మాయమైపోతారు...ఇదీ ఈ ముఠా డబ్బు సంపాదనకు ఎంచుకున్నమార్గం...నలుగురు సభ్యుల ఈ ఛీటింగ్ ముఠా మేడికొండూరు పోలీసులకు దొరికిపోయింది.
పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం...మేడికొండూరు మండలం జంగంగుంట్లపాలెం సమీపంలో పొట్లపాడుకు చెందిన బండి శివ తిరుపతిరెడ్డి బ్రిక్స్ కంపెనీ నిర్వహిస్తుంటారు. గత నెల 22వ తేదీన నలుగురు యువకులు బ్రిక్స్ కంపెనీ దగ్గరకు వచ్చి...తమకు పని కావాలని...మీకు పనివాళ్లు అవసరం ఉంటే చెప్పండంటూ...తమ వివరాల కోసం ఆధార్కార్డులు చూపారు. అలా ఆయనకు మాయమాటలు చెప్పి పని కోసమంటూ అడ్వాన్స్గా రూ.1.10 లక్షలు తీసుకున్నారు. ఆ తర్వాతే రోజే కనిపించకుండా మాయమయ్యారు.
దీనితో తిరుపతిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. అనంతరం ఈ ముఠా కోసం అన్వేషణ జరిపి ఎట్టకేలకు వారిని పట్టుకున్నారు. ఆ తరువాత వారిని లోతుగా విచారణ చేస్తే అనేక ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. వీరిది తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లా పాలవంశ ని తెలిసింది. బత్తుల వెంకటేష్, ముద్దంగుల శ్రీను, చల్లా ఉపేంద్ర , కల్లూరి మల్లికార్జున అనే ఈ నలుగురు ఒక ముఠాగా ఏర్పడి రకరకాల పేర్లతో నకిలీ ఆధార్ కార్డులు సృష్టించడం మొదలుపెట్టారు.
బ్రిక్స్ తయారీ కంపెనీలకు బాగా పనివాళ్ల కొరత ఉండటంతో... వీరు వివిధ బ్రిక్స్ తయారీ కంపెనీల వద్దకు వెళ్లి పనికి వస్తామని...తమతో మరికొంతమందిని పనికి తీసుకొస్తామని...ఖర్చుల కోసం కొంత పైకం ఇమ్మంటూ మాయమాటలు చెప్పి ముందుగా అడ్వాన్స్లు తీసుకునేవారు...ఆ తర్వాత కంటికి కనబడకుండా మాయమయ్యేవారు. ఇలా వీరు గుంటూరు జిల్లాలో ఫిరంగిపురం, నాదెండ్ల, ముప్పాళ్ళ, నల్లపాడు, గుంటూరు ఆటోనగర్లతో పాటు తాడేపల్లిగూడెం, పశ్చిమగోదావరి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు విచారణతో తేలిందని పోలీసులు తెలిపారు. వీరిని అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరుస్తున్నట్లు వెల్లడించారు.