ఎట్టకేలకు చిక్కారు: గ్యాంగ్ రేప్లతో ప్రకాశంను వణికించిన 'దండుపాళ్యం' ముఠా?
ఒంగోలు: ప్రకాశం జిల్లాలో కొన్నేళ్లుగా 'దండుపాళ్యం' తరహా ముఠా హల్చల్ చేస్తోంది. ఏకాంతంగా సంచరించే జంటలపై దాడులు చేస్తూ మహిళలపై గ్యాంగ్ రేప్లకు పాల్పడుతోంది. సుమారు రెండేళ్లుగా ఈ ముఠా జిల్లాలో 30కి పైగా నేరాలకు ఒడిగట్టినట్టు పోలీసులు గుర్తించారు.
ఈ ముఠా బాధితుల్లో ఎక్కువమంది వివాహేతర సంబంధాలున్నవారు, విద్యార్థులు, భార్యాభర్తలే కావడంతో.. పరువు పోతుందన్న భయంతో వారెవరూ పోలీసులను ఆశ్రయించలేదు. ఒకటీ, రెండు కేసుల్లో ముఠా తమను దోపిడీ చేసిందని కొంతమంది ఫిర్యాదు చేసినా పోలీసులు కూడా పెద్దగా పట్టించుకోలేదు.
ఇటీవల ఓ వ్యక్తి తనపై కొందరు దాడికి పాల్పడ్డారంటూ ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ముఠా లీలలు వెలుగుచూశాయి. ఈసారి కాస్త సీరియస్గా దృష్టి పెట్టిన పోలీసులు.. సీక్రెట్ ఆపరేషన్ చేపట్టారు. ఎట్టకేలకు 10 మంది సభ్యుల ముఠాలో తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. ఇందులో ఒకరు జువైనల్. మరో వ్యక్తి పరారీలో ఉన్నాడు.
చీమకుర్తి గరికమిట్టకు చెందిన పాలపర్తి ఏసు అనే వ్యక్తి ముఠాలో కీలక సూత్రధారిగా గుర్తించారు. గురువారం సాయంత్రానికి ఈ ముఠాపై జిల్లాలోని పలు ప్రాంతాల్లో 7 కేసులు నమోదైనట్టు పోలీసులు తెలిపారు. అత్యాచారాలకు పాల్పడినట్టు బాధితులు అంగీకరించినా.. ఎవరి నుంచి ఫిర్యాదులు లేకపోవడంతో కేవలం దోపిడీ కేసులు మాత్రమే పెట్టినట్టు చెప్పారు.