జనసేన కార్యకర్త అరెస్ట్: ఒక్కరి కోసం 100మంది పోలీసులా?.. హైడ్రామా!
అరెస్టుకు ఒకరోజు ముందు.. పాగోలులో ఓ మద్యం దుకాణానికి వ్యతిరేకంగా మహిళలు చేపట్టిన ఆందోళనలో రాయపూడి వేణుగోపాల్ పాల్గొన్నారు.
విజయవాడ: ఏపీలో ఓ జనసేన పార్టీ కార్యకర్త అరెస్టు తీవ్ర ఉద్రిక్తతలను తలపించింది. కృష్ణా జిల్లా అవనిగడ్డ ఈ ఉద్రిక్తతలకు కేంద్రబిందువుగా నిలిచింది. అవనిగడ్డకు చెందిన జనసేన కార్యకర్త, న్యాయవాది అయిన రాయపూడి వేణుగోపాలరావు ఇటీవల స్థానిక వైద్యశాలలో ఓ వ్యక్తిని కులం పేరుతో దూషించాడని, దీనిపై ఫిర్యాదు అందడంతోనే ఆయన్ను అరెస్టు చేయాల్సి వచ్చిందని పోలీసులు తెలిపారు.
బుధవారం ఆయన్ను అదుపులోకి తీసుకున్న వేళ.. దాదాపు 100మందికి పైగా పోలీసులు ఆయన నివాసాన్ని చుట్టుముట్టడం స్థానికులను ఆశ్చర్యపోయేలా చేసింది. స్థానిక సీఐ, కోడూరు ఎస్ఐలు ఆయన నివాసంలోకి వెళ్లి.. బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన నుంచి సెల్ ఫోన్ లాక్కున్నారని తెలుస్తోంది.
కాగా, ఓ న్యాయవాదిని తీవ్రవాది తరహాలో అరెస్టు చేయడం ఏంటని స్థానిక ప్రజలు ప్రశ్నిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న తర్వాత ఆయన్ను పోలీస్ స్టేషన్ కు తరలించడంతో.. స్థానికులంతా పెద్ద ఎత్తున స్టేషన్ వద్దకు చేరుకుని ఆందోళన చేసేందుకు యత్నించారు. కానీ వేణుగోపాలరావు వారిని వారించడంతో ఆందోళన విరమించారు.
Recommended Video
అరెస్టుకు ఒకరోజు ముందు.. పాగోలులో ఓ మద్యం దుకాణానికి వ్యతిరేకంగా మహిళలు చేపట్టిన ఆందోళనలో రాయపూడి వేణుగోపాల్ పాల్గొన్నారు. స్టేషన్ నుంచి ఆయన్ను కోర్టుకు తీసుకెళ్లిన సమయంలోను.. మహిళలు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకున్నారు. రిమాండ్ కు తరలించే క్రమంలో పోలీసు జీపును చుట్టుముట్టి రాయపాటి తరలింపుకు అడ్డుపడటానికి యత్నించారు.
దీనిపై బందరు డీఎస్పీ శ్రావణ్ కుమార్ స్పందించారు. ఈ ఏడాది మే14న వైద్య సేవల విషయమై రాయపూడి వైద్యశాలకు వెళ్లిన వేణుగోపాలరావు.. అక్కడి సిబ్బందిని కులం పేరుతో దూషించినట్లు తమకు ఫిర్యాదు అందిందని చెబుతున్నారు. ఫిర్యాదు మేరకు బుధవారం నాడు రాయపూడిని అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరుపరిచామని, ఆపై న్యాయమూర్తి ఆదేశం మేరకు రిమాండ్ కు తరలించామని అన్నారు.