ఇదో పేకాట రాకెట్:ఎట్టకేలకు గుట్టురట్టు..."బెట్టింగ్ కింగ్ మళ్లీ దొరికాడు"
కృష్ణాజిల్లా: కష్టపడి డబ్బు సంపాదించాలంటేనే చాలా కష్టం...అయినా అందులో పెద్ద కిక్ ఏముంది అనుకుంటున్నారో ఏమో...కొందరు అక్రమార్కులు అడ్డదారిలో డబ్బులు సంపాదించడానికి అనేక ఐడియాలు వేస్తున్నారు. అలా పేకాట ద్వారా కాసులు రాబట్టేందుకు ఓ ముఠా పెద్ద నెట్ వర్కే ఏర్పాటు చేసుకొంది... అంతేకాదు...ఇందుకోసం ప్రత్యేకంగా కొంత మంది మనుషులు, కొన్ని రహస్య స్థావరాలను సైతం ఏర్పాటు చేసుకొని యథేచ్చగా పేకాట దందా సాగిస్తోంది.
ఇలా రెండు తెలుగు రాష్ట్రాల సరిహద్దుల్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాట ఆడిస్తున్న ఈ ముఠా గుట్టు కృష్ణాజిల్లా పోలీసులు రట్టుచేశారు. ఈ పేకాట రాకెట్ గురించి సమాచారం అందుకున్నపోలీసులు దాడి నిర్వహించగా...కొందరు కీలక వ్యక్తులు పారిపోయినా మరి కొంతమందిని పోలీసులు పట్టుకోగలిగారు. అయితే కొందరు ప్రజాప్రతినిధులే ఈ పేకాట సూత్రధారులని తెలిసి పోలీసులు విస్తు పోయారు...మరోవైపు ఎపిలో బెట్టింగ్ కింగ్ గా పేరు బడిన నెల్లూరు వాసి కృష్ణ సింగ్ మరోసారి పోలీసులకు పట్టుబడటం కలకలం సృష్టించింది...అయితే ఈసారి ఇతడు పేకాట కేసులో పోలీసులకు దొరకడం మరో విశేషం.
కృష్ణాజిల్లా నందిగామ డిఎస్పీ మీడియా సమావేశంలో ఈ పేకాట రాకెట్ వివరాలు వెల్లడించారు...తెలంగాణలోని సూర్యాపేట జిల్లా హుజూర్నగర్కు చెందిన కౌన్సిలర్లు బెల్లంకొండ శ్రీను, పిట్టల రవిలతో పాటు, జగ్గయ్యపేట పట్టణం కాకానినగర్కు చెందిన గోనుగుంట్ల సీతారామ్ అలియాస్ చంటి, గార్లపాటి సాయిరామ్ అలియాస్ రామ్, జగ్గయ్యపేట మండలం షేర్మహ్మద్పేటకు చెందిన మార్తి లింగారావు ముఠాగా ఏర్పడి జగ్గయ్యపేట, వీరులపాడు, చెవిటికల్లు, మధిర, అచ్చంపేట, కోదాడ ప్రాంతాల్లో ఏజెంట్ల ద్వారా రహస్య ప్రదేశాలను గుర్తించి కోత ముక్క ఆడిస్తున్నారని డిఎస్పీ తెలిపారు. జగ్గయ్యపేట సమీపంలోని సత్యనారాయణపురం రోడ్డు గిన్నె చెరువు వద్ద వీరు పేకాడుతున్నారన్న సమాచారంతో జగ్గయ్యపేట పోలీసులు దాడి నిర్వహించినట్లు చెప్పారు.
సూత్రధారులు పారిపోయారు...పాత్రధారులు దొరికారు
అయితే ఈ పేకాట రాకెట్ కీలక సూత్రధారులు పారిపోగా కాపలదార్లలో చిల్లకల్లుకు చెందిన వనబోలు శ్రీను, పేకాట ఆడేందుకు వచ్చిన ఖమ్మంకు చెందిన ఉడతా మల్లికార్జున్ అలియాస్ చెవుల శంకర్, జగ్గయ్యపేటకు చెందిన షేక్ కరీమ్, నిర్వాహకులు గోనుగుంట్ల సీతారామ్, గార్లపాటి సాయిరామ్, మార్తి లింగారావులను అరెస్టు చేసి, పదివేల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్టు డిఎస్పీ తెలిపారు.
పెద్ద నెటవర్కే...కాదు...పటిష్టమైంది కూడా...
వీరు కొందరు ప్రత్యేకమైన వ్యక్తులతో పటిష్ఠమైన నెట్వర్క్ ఏర్పాటు చేసుకొని ఎవరికీ అనుమానం రాకుండా రహస్యప్రాంతాల్లో పేకాట ఆడిస్తున్నారని...దీంతో ఇక్కడ పేకాండేందుకు ఖమ్మం, కృష్ణా, సూర్యాపేటలతో పాటు గుంటూరు జిల్లాకు చెందిన పేకాటరాయుళ్లు పెద్ద సంఖ్యలో వస్తున్నట్లు తెలిసిందని డిఎస్పీ తెలిపారు. గత నెల 20 నుంచి 26 తేదీల మధ్య చెవిటికల్లులో నిర్వహించిన ఒక పేకాట స్థావరం దగ్గరే రూ.50లక్షల వరకు చేతులు మారినట్లు తెలిసిందన్నారు. అయితే ఈ పేకాట రాకెట్ లో కీలక సూత్రధారులైన హూజర్నగర్ కౌన్సిలర్లు పరారయ్యారని...త్వరలోనే వారిని కూడా పట్టుకుంటామని వెల్లడించారు.
బెట్టింగ్ కింగ్ మళ్లీ దొరికాడు...ఈసారి పేకాటలో...
కృష్ణసింగ్...ఈ పేరెప్పుడైనా విన్నారా...ఎక్కడో విన్నట్టు గుర్తుకొస్తోందే అనుకుంటున్నారా?...నిజమే ఇటీవలే నెల్లూరు లో గుట్టు రట్టయిన బెట్టింగ్ మాఫియాలో కీలక సూత్రధారిగా పోలీసులు అరెస్ట్ చేసిన ఈ కృష్ణసింగ్ తాజాగా మరోపారి పోలీసులకు చిక్కాడు...అయితే ఈసారి బెట్టింగ్ వ్యవహారంలో కాకుండా పేకాట కేసులో పోలీసులకు పట్టుబడటమే కొసమెరుపు...క్రికెట్ బెట్టింగ్ కేసులో ప్రధాన ముద్దాయి అయిన కృష్ణసింగ్ ఆ తర్వాత బెయిల్పై విడుదలయ్యాడు...అయితే పాత బుద్దిని మార్చుకోకుండా పాత ఫీల్డ్ ని మాత్రమే పక్కనబెట్టి పేకాట లో పోలీసులకు దొరికాడు.
ఎలా దొరికాడంటే...
కృష్ణసింగ్...ఎలా దొరికాడంటే...మంగళవారం అర్ధరాత్రి కందమూరు అటవీ ప్రాంతంలో కొందరు పేకాట ఆడుతుండగా పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు దాడి జరపగా అక్కడ 20 మంది పట్టుబడ్డారు. ఆ 20 మందిలో కృష్ణసింగ్ కూడా ఉన్నట్లు తెలిసి పోలీసులు ఆశ్చర్యపోయారు. వీరి నుంచి సుమారు రూ.70 లక్షల విలువ చేసే సొత్తు స్వాధీనం చేసుకున్నామని, ఇందులో 20 లక్షల నగదు, ఒక లగ్జరీ కారు కూడా ఉన్నట్లు నెల్లూరు రూరల్ సిఐ శ్రీనివాసుల రెడ్డి తెలిపారు. వీరిపై కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నామని చెప్పారు.