కొత్త కోణం: సిండికేట్ బ్యాంక్ ఎదుట యువ రైతు ఆత్మహత్య
హైదరాబాద్: అనంతపురం జిల్లాలోని ఉరవకొండలో గురువారం సిండికేట్ బ్యాంకు ఎదుట పురుగుల మందు తాగి రైతు కోదండరామిరెడ్డి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. రైతుకు ఆత్మహత్యకు కారణం బ్యాంకు మేనేజర్ వేధింపులే కారణమని తొలుత అందరూ భావించారు.
అయితే తాజాగా యువ రైతు ఆత్మహత్య కేసులో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. బ్యాంకు మేనేజర్ వేధింపులకు తోడు పోలీసులు కొట్టడంతో అతడు ప్రాణాలు తీసుకున్నాడని రాయంపల్లి గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. యువరైతుని పోలీసులు కొడుతుండగా తామంతా ప్రత్యక్షంగా చూశామని వారు చెబుతున్నారు.
బ్యాంకు మేనేజర్ ఆదేశాల మేరకే అతడిని పోలీసులు కొట్టారని పేర్కొన్నారు. బ్యాంకు మేనేజర్నే నిలదీస్తావా అంటూ అతడిపై పోలీసులు చేయిచేసుకున్నారని తెలిపారు. అనంతరం సిండికేట్ బ్యాంకు ఆవరణలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.
రుణం చెల్లించినా పాసు పుస్తకం ఇవ్వడానికి బ్యాంకు అధికారులు నిరాకరించడంతో అతడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్ధానికులు అతడిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గం మధ్యలో మృతి చెందాడు. మేనేజర్ వేధింపుల వల్లే తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు సూసైడ్ నోట్లో పేర్కొన్న సంగతి తెలిసిందే.
పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. పాత బకాయిలు చెల్లిస్తేనే కొత్త రుణాలు ఇస్తామని సిండికేట్ బ్యాంకు మేనేజర్ శివశంకర్ వేధించడంతో తీవ్ర మనస్ధాపానికి గురైన కొదంరామిరెడ్డి అనే రైతు బ్యాంకు ఎదుట ఆత్మహత్యకు పాల్పడ్డాడు.