భూ వివాదం నేపత్యంలో...బోండా ఉమ అనుచరులపై కేసు
విజయవాడ:సుబ్బరాయ నగర్ వెంచర్ భూ వివాదానికి సంబంధించి ఎమ్మెల్యే బోండా ఉమ అనుచరులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉమ అనుచరులపై 420, 427, 471, 506 మరియు 34,120బి సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ఈ క్రమంలో ఈ కేసుకు సంబంధించి బోండా ఉమ అనుచరులు మాగంటి బాబు, వాసును పోలీసుల అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడు పీవీఎస్ఎస్ వర్మ పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.
గతంలో స్వాతంత్ర్య సమర యోధుల స్థలం కబ్జా ఆరోపణలతో ఒకసారి భూ వివాదంలో చిక్కుకున్న టిడిపి ఎమ్మెల్యే బోండా ఉమ తాజాగా మరో భూవివాదంలో చిక్కుకున్న సంగతి తెలిసిందే. సుబ్బరాయనగర్ వెంచర్లో స్థలం ఇస్తామని చెప్పి రూ.35 లక్షలు తీసుకుని స్థలం ఇవ్వలేదని బాధితుడు మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.
అనంతరం నందిగామకు చెందిన బాధితుడు సుబ్రమణ్యం స్థానికుల సహాయంతో బోండా ఉమ, ఆయన అనుచరులు మాగంటి బాబు, వాసు, వర్మపై...నగర సీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు బాధితుడి ఫిర్యాదు మేరకు బోండా ఉమ అనుచరులపై కేసు నమోదు చేశారు.
స్వతంత్ర సమరయోధుల భూమిని తప్పుడు పత్రాలతో ఎమ్మెల్యే అనుచరులు తనఖా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఆరోపణలు గతంలో వచ్చిన కేసులో బోండా ఉమ సతీమణిపై కూడా కేసు నమోదైన సంగతి విదితమే. ఈ వివాదానికి సంబంధించి బాధితులు సీఐడీని ఆశ్రయించారు. దర్యాఫ్తు చేపట్టిన అధికారులు ఎమ్మెల్యే భార్య సుజాతతో పాటు మరో 8 మందిపై కేసు నమోదు చేశారు.