అంతా భార్యే చేసింది: వీడిన డెత్ మిస్టరీ, హెచ్ఐవి సోకినా మారలేదనే..
కర్నూలు: కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరి పోలీస్స్టేషన్ పరిధిలోని బోడబండ అటవీ ప్రాంతంలో మార్చి 10 తెల్లవారుజామున నారాయణస్వామి అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంగతి తెలిసిందే.
సంఘటనా స్థలాన్ని పరిశీలించిన మీదట రోడ్డు ప్రమాదంలో చనిపోయినట్టుగా అనుమానాలు కలిగినప్పటికీ.. లోతుగా విచారించగా అసలు నిజాలు బయటపడ్డాయి. కట్టుకున్న భార్యే అతన్ని హత్య చేయించి ప్రమాదంగా చిత్రీకరించినట్టు పోలీసులు నిర్దారించారు.
భార్యాభర్తల గొడవలు:
పత్తికొండ సమీపంలోని రామచంద్రాపురానికి చెందిన నారాయణస్వామికి 1995లో వజ్రకూరూరు మండలం పీసీ ప్యాపిలికి చెందిన ఉమాదేవితో వివాహ మైంది. వీరికి ఇద్దరు సంతానం. వివాహం తర్వాత కొన్నిరోజులు కాపురం సాఫీగానే సాగింది. కానీ ఆ తర్వాత తరుచూ విభేదాలతో గొడవపడుతుండేవారు. ఉమాదేవిపై అనుమానం ఈ విభేదాలకు మరింత కారణమైంది.
హెచ్ఐవి సోకినా మారలేదు..:
చెడు తిరుగుళ్లు తిరిగే నారాయణ స్వామికి మట్కాతో పాటు చాలానే చెడ్డ అలవాట్లు ఉన్నాయి. ఈ క్రమంలో అతనికి హెచ్ఐవి కూడా సోకింది. దీంతో రోగం నయం కావడానికి తమ ఇంటి సమీపంలోని వన్నూరుస్వామి దగ్గరికి తీసుకెళ్లి నారాయణస్వామికి ఉమాదేవి తాయత్తులు కట్టించింది. అయినా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదు. దీంతో విసిగిపోయిన ఆమె భర్తను హత్య చేయడానికే నిశ్చయించుకుంది.
హత్యకు భార్య ఒప్పందం..:
నారాయణ స్వామిని హత్య చేయడానికి పన్నూరు స్వామితో రూ.1లక్ష ఒప్పందం కుదుర్చుకుంది. ఆపై పన్నుస్వామి జొన్నగికి చెందిన రాజశేఖర్కు ఆ పని అప్పగించాడు. ఇందుకోసం ఉమాదేవి సహాయం కూడా తీసుకున్నారు. మట్కాపై పట్టు ఉన్న వ్యక్తిగా రాజశేఖర్ను భర్తకు ఉమాదేవి పరిచయం చేసింది.
ఈ నేపథ్యంలోనే నారాయణస్వామి ఫిబ్రవరి 28న గోవా వెళ్లగా.. అతనితో పాటు రాజశేఖర్ కూడా అక్కడికి వెళ్లాడు. తిరిగి వచ్చే సమయంలో.. నారాయణస్వామిని చంపేందుకు ప్రయత్నించాడు. రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో.. అతిగా మద్యం తాగించి టవల్ తో గొంతు నులిమాడు.
షాక్ తిన్న ఉమాదేవి:
నారాయణస్వామిని రైల్లోనే చంపేసినట్టు ఉమాదేవికి ఫోన్ ద్వారా సమాచారం అందించాడు. కానీ ఆ మరుసటి రోజే నారాయణస్వామి ఇంటికి రావడంతో ఆమె షాక్ తిన్నది. రాజశేఖర్ నారాయణస్వామి చనిపోయినట్టు పొరపడ్డాడని గుర్తించింది. దీంతో మరోసారి అతన్ని చంపేందుకు పథకం వేయాలని రాజశేఖర్ కు చెప్పింది.
మరోసారి ప్లాన్.. హత్య:
ఉమాదేవి సూచన మేరకు మరోసారి హత్యకు ప్లాన్ వేశాడు రాజశేఖర్.అనంతపురంలో ఉన్న తన అన్న సుధాకర్, బాలునాయక్లను రప్పించాడు. ఈ నెల 9న ప్యాపిలి బాటసుంకులమ్మను దర్శనానికి నారాయణస్వామి వెళ్లినట్టు ఉమాదేవి ద్వారా తెలుసుకున్నారు.
ఆ రాత్రి అక్కడే నిద్రించి.. మరుసటి రోజు బోడబండకు బయలుదేరిన అతన్ని బైకుల మీద వెంబడించారు. మార్గమధ్యలో ఒకచోట నారాయణస్వామిని అడ్డగించి.. చున్నీతో గొంతు నులిమి చంపేశారు.
రోడ్డు ప్రమాదంగా..:
హత్యానంతరం దాన్ని రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి నిందితులు ప్రయత్నించారు. ఉమాదేవి సూచన మేరకు నారాయణస్వామిపై బైక్ ను పడేసి నిందితులు అక్కడినుంచి పరార్ అయ్యారు. అనుమానం రాకుండా ఉండేందుకు కొత్త సిమ్ కార్డుతో ఉమాదేవి ఈ వ్యవహారం నడిపింది. ఆమెపై అనుమానంతో అదుపులోకి తీసుకుని విచారించగా.. ఈ నిజాలన్ని బయటపడ్డాయి.