ముద్రగడ దంపతులకు వైద్య పరీక్షలు: చినరాజప్పపై ముద్రగడ వ్యంగ్యం
కిర్లంపూడి: జబ్బు ఒకచోట చేస్తే, వైద్యం మరొక చోట చేస్తున్నారని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అన్నారు. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్తో కాపు ఉద్యమ నేత మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం శక్రవారం ఉదయం 8.30 గంటలకు ఆమరణ నిరాహారీ దీక్షకు దిగారు. తుర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం కిర్లంపూడిలోని తన ఇంటిలో ఆయన సతీసమేతంగా దీక్షను ప్రారంభించారు.
ఆమరణ దీక్ష ప్రారంభించిన ముద్రగడ పద్మనాభం దంపతులకు ప్రభుత్వవైద్యులు పరీక్షలు నిర్వహించారు. బీపీ, షుగర్ లెవెల్స్ సాధారణ స్థాయిలోనే ఉన్నాయని చెప్పిన వైద్యులు ఇందుకు సంబంధించిన వివరాలను తెలిపారు. ముద్రగడ బరువు 84 కిలోలు, బీపీ-160/110, షుగర్-178 కాగా, ఆయన భార్య పద్మావతి బీపీ-180/110, బ్లడ్ షుగర్-121 ఉందని వైద్యులు పేర్కొన్నారు.
దీక్షలో ఉన్న సమయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాపులను బీసీల్లో చేర్చాలనే డిమాండ్ నా కోసం చేస్తున్న ఉద్యమం కాదని, తన జాతి కోసం చేస్తున్న ఉద్యమమని ఆయన చెప్పుకొచ్చారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి చంద్రబాబు కాపులను జీవోల పేరుతో మోసం చేస్తున్నారని మండిపడ్డారు.
కాపులకు రిజర్వేషన్లు అనేవి నాలాంటి తెల్లచొక్కా వేసుకున్నా వారి కోసం కాదని, పేదవాళ్ల కోసం అడుగుతున్నానని అన్నారు. నా జాతిలో ఉన్న పేదలకు అన్నం పెట్టే అవకాశం కల్పించమని అడుగుతున్నానన్నారు. నేను అడిగే డిమాండ్లు కొత్తవేమీ కాదని చెప్పిన ముద్రగడ ఎన్నికల సందర్భంలో చంద్రబాబు ఇచ్చిన హామీలనే కోరుతున్నామన్నారు.
ఎన్నికల సమయంలో కాపులను బీసీల్లో చేర్చుతామని ముఖ్యమంత్రి చంద్రబాబు హామీలను ఇచ్చారని, పలు బహిరంగ సభల్లో చెప్పారు కాబట్టే ఈరోజు తాము రిజర్వేషన్ల కోసం రోడ్డెక్కామన్నారు. మా జాతి ఓట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత కాపుల రిజర్వేషన్లను పక్కనబెట్టారన్నారు.
స్వయాన తాను ముఖ్యమంత్రికి నాలుగైదు ఉత్తరాలు రాశానని, అయినా సరే ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు. గత నెల తునిలో జరిగిన కాపు ఐక్య గర్జన సభ జరగకుండా ఉండేందుకు, సభ పెట్టకుండేలా చాలా పలు విధాలా ఎదురుదాడులు చేయించారన్నారు.
అంతేకాదు సభలో తెలుగుదేశం పార్టీ నాయకులకు చెందిన సంఘ విద్రోహాశక్తులను చొప్పించి తుని ఐక్య గర్జనను హింసాత్మకంగా మార్చారని మండిపడ్డారు. గురువారం టీడీపీ చెందిన తోట త్రిమార్తులు, బొండా ఉమామహేశ్వరరావు ప్రభుత్వం తరుపున తనతో చర్చలు జరపలేదన్నారు.
కేవలం స్నేహపూర్వకంగానే తన ఇంటికి వచ్చారని ఆయన తెలిపారు. సీఎంకు, నీకు మధ్య రాయబారం చేస్తామని, అయితే చిన్న చిన్న సడలింపులు ఇవ్వాలని కోరారని అన్నారు. కాపు రిజర్వేషన్లపై ప్రభుత్వం కమిషన్ వేసిందని అంత వరకు దీక్షను విరమించుకోవాలని కోరారని తెలిపారు.
అయితే తాను మాత్రం 3 నెలల్లో నివేదికను తెప్పించి కాపుల రిజర్వేషన్లుపై అధికారిక ప్రకటన చేయాలని కోరినట్లు అన్నారు. ఇందుకు ప్రభుత్వం సిద్ధంగా లేదని వారు పేర్కొన్నారు. మరోవైపు పత్రికల్లో వచ్చే వార్తలను బట్టి తాను దీక్షను విరమించలేనని తెలిపారు.
జబ్బు ఒకచోట చేస్తే వైద్యం మరోచోట చేస్తున్నారని అన్నారు. ఆమరణ దీక్షలో భాగంగా నాకు ఎలాంచి ప్రాణాపాయం లేదన్నారు. ఎటువంటి రక్షణ కూడా అవసరం లేదన్నారు. నా ప్రాణం నా జాతికి అంకితమవ్వాలనే, నా జాతికి ఏదో కాస్త సేవ చేయాలనే తాను ఈ దీక్షకు దిగినట్లు ఆయన చెప్పుకొచ్చారు.
సీఎం ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకే తాను రోడ్డెక్కానని అన్నారు. తన డిమాండ్లలో ఏ ఒక్కటైనా నెరవేర్చేందుకు సీఎం చంద్రబాబు ముందుకొస్తే దీక్షపై పునరాలిస్తానని అన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు కాపులకు ఏడాదికి రూ. 1000 కోట్లు కేటాయించాలన్నారు.
కాపు ఐక్య గర్జనలో భాగంగా జరిగిన విధ్వంసకాండలో నా సోదరులపై అక్రమ కేసులు బనాయిస్తున్నారన్నారు. తుని ఘటనపై లోతుగా విచారణ చేపట్టిన తర్వాతనే అరెస్టు చేయాలని కోరారు. అవసరమైతే తుని ఘటనపై సీబీఐ విచారణకైనా తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇచ్చిన సూచనల ప్రకారం తన సోదరులపై కేసులు పెడితే సహించేలేదని మండిపడ్డారు. కాపు జాతిని తాకట్టు పెట్టారని, తన ఇంటికి రావొద్దని హోం మంత్రి చినరాజప్ప చేసిన వ్యాఖ్యలపై కాస్తంత వ్యంగంగా మాట్లాడారు. కాపు జాతిని తానెప్పుడూ తాకట్టు పెట్టలేదన్నారు.
కాపు జాతిని ఏ రాజకీయ నాయకుడికి అమ్మలేదన్నారు. కాపులను మా ఇంటికి రావొద్దని ఎప్పుడు అనలేదన్నారు. మా జాతి ముసుగులో తానెప్పుడూ దోపిడీ చేయలేదన్నారు. హోం మంత్రి చినరాజప్ప, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఇద్దరూ చాలా పెద్దవారన్నారు. వారితో మాట్లాడే అంత గొప్పవాడని కాదన్నారు.
ఏపీలో ఒక హోంగార్డుని కూడా బదిలీ చేయలేనంత గొప్పవారని హోంమంత్రి చినరాజప్పను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. మరోవైపు తూర్పు గోదావరి జిల్లా నుంచి తండోపతండాలుగా ముద్రగడ అభిమానులు ఆయన ఇంటికి వస్తున్నారు. ముద్రగడ మద్దతుదారులను కిర్లంపూడి ఊరిశివార్లలోనే పోలీసులు అడ్డకుంటున్నారు.
పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో కిర్లంపూడిలో 144 సెక్షన్ను విధించారు. మరోవైపు ముద్రగడ పద్మనాభం ఇంటి గేట్లను శుక్రవారం ఉదయం పోలీసులు మూసివేశారు. తన భార్య పద్మావతితో కలిసి ముద్రగడ ఆమరణదీక్షకు దిగిన వెంటనే పోలీసులు ఆయన ఇంటి గేట్లను మూసేశారు. గేట్లు తెరిచేందుకు ముద్రగడ అనుచరులు ప్రయత్నిచడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి.