మరో వివాదంలో జేసీ!: ఎందుకలా చేస్తున్నారు?.. డీఐజీకి ఫిర్యాదు..
అధికారులు తమకు అనుమతిలిచ్చినా.. జేసీ మాత్రం అడ్డుపడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జేసీ అడ్డుపడుతుండటంతో తమ ఆశ్రమానికి నీటిని నిలిపివేశారని అన్నారు.
అనంతపురం: వివాదాలకు కేరాఫ్గా పేరు తెచ్చుకున్న జేసీ బ్రదర్స్.. ఎప్పుడూ ఏదో వివాదంతో వార్తల్లోకి ఎక్కుతూనే ఉన్నారు. అనంతపురం ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి విశాఖ ఎయిర్ పోర్టులో చేసిన రచ్చపై నిన్నటిదాకా ఆయనపై విమర్శలు వెల్లువెత్తగా.. తాజాగా ఆయన సోదరుడు, తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డిపై అనంతపురం పోలీసులకు ఫిర్యాదు అందింది.
తమ ఆశ్రమానికి రావాల్సిన ఇసుకను జేసీ ప్రభాకర్ రెడ్డి అన్యాయంగా అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ.. శ్రీకృష్ణాశ్రమం చైర్మన్ సూర్య సోమవారం డీఐజీకి ఫిర్యాదు చేశారు. అధికారులు తమకు అనుమతిలిచ్చినా.. జేసీ మాత్రం అడ్డుపడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. జేసీ అడ్డుపడుతుండటంతో తమ ఆశ్రమానికి నీటిని నిలిపివేశారని అన్నారు.
తమ ఆధ్యాత్మిక సంస్థపై కక్షాపూరితంగా వ్యవహరిస్తున్న జేసీపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని డీఐజీని సూర్య కోరారు. ప్రత్యర్థులపై అంతెత్తున లేచిపడే జేసీ.. దీనిపై ఎలా స్పందిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.