సాయం కోరి వెళ్తే.. ఎమ్మెల్యేనే ముంచాడు: 'ఆమంచి'పై చీటింగ్ ఆరోపణ
సరుకుల కొనుగోలుకు కొటేషన్ తీసుకురావాలని అధికారులు చెప్పడంతో.. సహాయం కోసం స్థానిక ఎమ్మెల్యేను ఆశ్రయించగా.. ఎమ్మెల్యే అతన్ని మోసం చేశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చీరాల: కిరాణ కొట్టు పెట్టుకోవాలనుకున్న ఓ వ్యక్తి కార్పోరేషన్ ద్వారా 2014-15లో బ్యాంకు రుణం కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు. వివరాలు పరిశీలించిన బ్యాంకు అధికారులు అతనికి రూ.2లక్షలు రుణం మంజూరు చేశారు.
అయితే సరుకుల కొనుగోలుకు కొటేషన్ తీసుకురావాలని అధికారులు చెప్పడంతో.. సహాయం కోసం స్థానిక ఎమ్మెల్యేను ఆశ్రయించగా.. ఎమ్మెల్యే అతన్ని మోసం చేశాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. వేటపాలెంకు మండలానికి సర్వేపల్లి సుబ్బయ్య అనే వ్యక్తి బ్యాంకు ద్వారా రెండేళ్ల క్రితం రూ.2లక్షల రుణం పొందాడు. సరుకుల కొటేషన్ తీసుకురావాలని బ్యాంకు అధికారులు సూచించడంతో స్థానిక ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ను ఆశ్రయించాడు.
దీంతో ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ చీరాలకు చెందిన చుండూరి శ్రీనివాసరావు అనే వ్యాపారితో కొటేషన్ ఇప్పించారు. కొటేషన్ ఇప్పించారు గానీ చుండూరి శ్రీనివాసరావు తనకు డబ్బులు గానీ కిరాణా వస్తువులు గానీ ఇవ్వలేదని, అడిగితే అవహేళనగా మాట్లాడటం మొదలుపెట్టారు.
దీనిపై శ్రీనివాసరావును గట్టిగా నిలదీయడంతో.. తన పర్సెంటేజీ తాను తీసుకుని మిగతాది ఎమ్మెల్యేకు ఇచ్చేశానని చెప్పాడు. అలా.. చాలాసార్లు శ్రీనివాసరావును బ్రతిమాలగా.. చివరికి రూ.50వేలు తన ఖాతాలోకి ట్రాన్స్ ఫర్ చేశాడు.
మిగతా డబ్బులు ఇవ్వాల్సిందిగా ఎమ్మెల్యేను ప్రాధేయపడగా.. కులం పేరుతో దూషించి పంపారని బాధితుడు చెబుతున్నాడు. ఎమ్మెల్యే ఆగడాలపై స్థానిక వైసీపీ ఇన్ చార్జీ అమృతపాణితో కలిసి పోలీసులను బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటీ కింద ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశాడు. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని కూడా ఉందని ఫిర్యాదులో పేర్కొన్నాడు.
ఎమ్మెల్యే నుంచి తనకు రావాల్సిన రూ.1లక్షా 50వేలను ఇప్పించాల్సిందిగా అతను పోలీసులను వేడుకుంటున్నాడు.