శ్రీనివాస్ ఉండే ఫ్లాట్లోనే మరో గదిలో ఇద్దరు అమ్మాయిలు ఉండేవాళ్లట!...ముందే కుక్ ల రాకపై అనుమానాలు
శాఖపట్నం:ప్రతిపక్షనేత జగన్ పై హత్యాయత్నం ఘటనలో కుట్ర కోణాలు వెలికితీతకు అన్ని కోణాల్లో...లోతుగా విచారణ జరుగుతోంది. వైసిపి అధినేతపై జరిగింది హత్యాయత్నమేనని పోలీస్ రిపోర్ట్ పేర్కొన్న నేపథ్యంలో ఇప్పటికైనా ఈ దాడి వెనుక అసలు కారణాలు వెలికితీయాలని వైసిపి నేతలు డిమాండ్ చేస్తున్నారు.
మరోవైపు జగన్ పై కత్తితో దాడి చేసిన నిందితుడు జనుపూడి శ్రీనివాసరావు నివాసం ఉంటున్న ఫ్లాట్ ఎయిర్పోర్టుకు కేవలం కిలోమీటరు దూరంలోపే ఉందని తెలిసింది. ఈ ఫ్లాట్ లో శ్రీనివాస్ తో పాటు అతనితో పాటు రాజు అనే వ్యక్తి, మరో యువకుడు కూడా ఉండేవారని...అలాగే ఇదే ఫ్లాట్ లోని మరో గదిలో ఇద్దరు అమ్మాయిలు ఉండేవారని సాక్షి పత్రిక పేర్కొంది. అయితే కొన్ని రోజుల క్రితమే వాళ్లు అక్కడ నుంచి వెళ్లిపోవడంతో పాటు శ్రీనివాస్ పనిచేసే హోటల్ లో చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు చర్చనీయాంశంగా మారాయి.
విశాఖ ఎయిర్ పోర్టు ఎదురుగా ఉన్న విమాననగర్ రెండో లైన్లోని శాంతినివాస్ రెండో అంతస్తులోని ఒక ఫ్లాట్లో జగన్ పై దాడి చేసిన శ్రీనివాసరావు ఉంటున్నాడని తెలిసింది. ఈ ఫ్లాట్ లో శ్రీనివాస్ తో పాటు రాజు అనే వ్యక్తి, మరో యువకుడు, ఇద్దరు యువతులు వేర్వేరు గదులు షేర్ చేసుకొని ఉండేవారని తెలుస్తోంది. వీళ్లంతా ఎయిర్పోర్టులో ఉన్న ఫ్యూజన్ ఫుడ్స్లోనే పనిచేసేవారని...వీరిలో రాజు అనే వ్యక్తితో శ్రీనివాసరావు బాగా క్లోజ్ గా ఉండేవాడని తెలిసింది.
అయితే ఉన్నట్టుండి ఈ నెల 20న మధ్యప్రదేశ్లోని గ్వాలియర్కు చెందిన నరేష్ కుష్వా, భరత్సింగ్ అనే కజిన్స్ ను ఫ్యూజన్ ఫుడ్స్ రెస్టారెంట్లో కుక్ లుగా పనిచేయడానికి హర్షవర్థన్ విశాఖ రప్పించారని సాక్షి ప్రత్యేక కథనంలో పేర్కొంది. అయితే గతంలో కూడా వీరిద్దరు ఇదే రెస్టారెంట్లో కుక్, అసిస్టెంట్ కుక్లుగా పనిచేసి ఈ ఏడాది జనవరిలో గ్వాలియర్కు వెళ్లిపోయారని...అయితే గతంలో కంటే ఎక్కువ జీతం ఇస్తానని హర్షవర్థన్ పలుసార్లు ఫోన్లు చేసి వీరిని రప్పించినట్లు ఆ కథనం లో పేర్కోవడం జరిగింది.
ఆ క్రమంలో వీరిద్దరూ విశాఖ వచ్చేసరికి తాము గతంలో ఉన్న గదిలో శ్రీనివాసరావు, రాజు, మరో వ్యక్తి ఉంటున్నారని, ఇద్దరు యువతులు అంతకు కొద్దిరోజుల ముందే వెళ్లిపోయారని నరేష్ కుష్వా చెప్పాడట. జనవరిలో తాము గ్వాలియర్ వెళ్లిపోయే సమయానికి శ్రీనివాసరావు అనే వ్యక్తి ఇక్కడకు రాలేదని వారు స్పష్టం చేశారట. తాము వచ్చి ఐదు రోజులే కావడంతో శ్రీనివాసరావుతో తమకు అంతగా పరిచయం లేదని, అతడు తమతో అంత కలుపుగోలుగా వ్యవహరించలేదని...బయట చలాకీగానే ఉండే వాడని వారు వివరించారట.
ఈ నేపథ్యంలో వైసిపి నేతల అనుమానం ఏమిటంటే?...జగన్ పై హత్యకు కుట్ర నేపథ్యంలో నిందితుడు శ్రీనివాస్ జైలు కెళ్లడం ఖాయమనే ఉద్దేశ్యంతోనే...రెస్టారెంట్ నడపడంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా...ఈ కుక్ లను మళ్లీ గ్వాలియర్ నుంచి ముందుగా రప్పించి ఉంటారనేది ఒక డౌట్. ఈ క్రమంలో శ్రీనివాస్ స్నేహితుడు రాజును పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారని తెలిసింది.
వైసిపి నేతల మరో అనుమానం...శ్రీనివాస్ తో పాటు ఈ ఫ్లాట్ లో నివాసం ఉండి కొద్ది కాలం కిందటే ఖాళీ చేసి వెళ్లిపోయిన ఇద్దరు అమ్మాయిలకు ఈ కుట్రతో ఏమైనా సంబంధం ఉందా అనేదే ఆ రెండో అనుమానం. అసలు ఆ ఇద్దరు అమ్మాయిలు ఎక్కడివారు...ఇప్పుడు ఎక్కడున్నారు?...అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదంటున్నారు. అయితే వాళ్ల దుస్తులు మాత్రం ఇప్పటికీ అదే ప్లాట్ లోని గదిలో ఉన్నాయట. ఈ క్రమంలో పోలీసులు ఆ ఫ్లాట్ కు వెళ్లి కొత్తగా వచ్చిన ఇద్దరు కుక్ లను విచారించగా తాము కొత్తగా వచ్చినందున తమకేమీ తెలీదని, తమకు తెలిసినంత వరకు వివరాలు వెల్లడించారట. దీంతో ఈ దాడి వెనుక ఎలాంటి సంచలనాలు బైటపడతాయనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.