ఏపీ మాజీ మంత్రి భూమా అఖిలప్రియ భర్తపై కేసు నమోదు
ఏపీ మాజీమంత్రి టీడీపీ నాయకురాలు భూమా అఖిలప్రియ భర్తపై కేసు నమోదైంది. క్రషర్ ఇండస్ట్రీ తనకు ఇవ్వాలని ఇండస్ట్రీ ఓనర్ ను భూమా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ బెదిరిస్తున్నాడని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆళ్లగడ్డ పోలీస్ స్టేషన్లో సదరు ఇండస్ట్రీ ఓనర్ శివరామిరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
మాజీ మంత్రి భూమా అఖిలప్రియ తల్లిదండ్రులు భూమా నాగిరెడ్డి, శోభా నాగిరెడ్డి దంపతులు జీవించి ఉన్న సమయంలో శివరామిరెడ్డి తో కలిసి పార్టనర్ షిప్ లో వారు క్రషర్ ఇండస్ట్రీ ప్రారంభించారు . శివరామిరెడ్డి కూడా భూమా కుటుంబానికి బంధువులే కావడంతో కలిసి బిజినెస్ చేయాలని నిర్ణయించుకున్నారు. అయితే ఆ తర్వాత భూమా నాగిరెడ్డి ,శోభా నాగిరెడ్డి మరణం తో భూమా అఖిలప్రియ రాజకీయంగా తెరంగేట్రం చేశారు. అతి తక్కువ కాలంలోనే మంత్రి కూడా అయ్యారు. ఆ తర్వాత భార్గవ్ రామ్ ని పెళ్లాడారు భూమా అఖిలప్రియ .
పార్టనర్ షిప్ లో నడుస్తున్న క్రషర్ విషయంలో మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ జోక్యం చేసుకొని క్రషర్ ఇండస్ట్రీ మొత్తం తమకే చెందుతుందని, తమకు అప్పగించాలని గత కొంతకాలంగా శివరామిరెడ్డి మీద ఒత్తిడి తెస్తున్నారు. నిన్న శివరామిరెడ్డి కి సంబంధించిన ఆఫీస్ మీద దాడి చేసి ఫర్నిచర్ ధ్వంసం చేశారు. క్రషర్ తమకు అప్పగించాల్సిందే అంటూ బెదిరింపులకు పాల్పడ్డారు . దీంతో శివరామిరెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదుచేసి భార్గవ్ రామ్ ను అరెస్ట్ చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. భార్గవ్ రామ్ అనుచరుల్లో ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు భార్గవ్ రామ్ కోసం గాలింపు చేపట్టారు .
గతంలో భార్గవ్ రామ్ మీద ఎన్నికల సమయంలో పోలింగ్ రోజున అహోబిలం లో జరిగిన ఘర్షణలో భార్గవ్ రామ్ మీద హత్యాయత్నం కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ రెండు కేసులు నేపథ్యంలో భార్గవ్ రామ్ ను అరెస్ట్ చేయడానికి పోలీసులు యత్నిస్తున్నారు. అయితే భార్గవ్ రామ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు గా తెలుస్తుంది. ఇప్పటికే ఎన్నికల ఓటమితో స్థానికంగా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటున్న భూమా అఖిల ప్రియకు ఇప్పుడు భర్తపై కేసు నమోదు కావటంతో పెద్ద చిక్కు వచ్చి పడింది. ఇక దీనిపై భూమా అఖిలప్రియ ఏమంటారు అన్నది తెలియాల్సి ఉంది.