భారీ గోల్డ్ డంప్... 8 ట్రంకు పెట్టెలు.... ఆ ఇంట్లో బయటపడ్డ నిధి...
అనంతపురం జిల్లా బుక్కరాయ సముద్రంలోని ఓ ఇంట్లో పోలీసులు భారీ గోల్డ్ డంప్ను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో బంగారంతో పాటు భారీగా క్యాష్,వెండి ఇతరత్రా వస్తువులు బయటపడినట్లు సమాచారం.
వివరాల్లోకి వెళ్తే... బుక్కరాయ సముద్రం పోలీసులకు వచ్చిన రహస్య సమాచారంతో పట్టణంలోని ఎస్సీ కాలనీలో ఉన్న బాలప్ప అనే వ్యక్తి ఇంట్లో సోదాలు జరిపారు. అనుమానంతో ఇంట్లో తవ్వకాలు జరపగా 8 పురాతన ట్రంకు పెట్టెలు బయటపడ్డాయి. అందులో దాదాపు 15 కిలోల బంగారం,వెండి,నగదు ఇతర వస్తువులను గుర్తించారు.బాలప్పను విచారించగా... అతని అల్లుడు నాగలింగ ఆ పెట్టెలను తీసుకొచ్చి తన ఇంట్లో పెట్టినట్లు చెప్పాడు. దీంతో నాగలింగను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
నాగలింగ ప్రభుత్వ ట్రెజరీ ఉద్యోగి మనోజ్ పేరును బయటపెట్టాడు. మనోజే ఆ పెట్టెల్ని తనకు ఇచ్చినట్లు పోలీసులతో వెల్లడించాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని కూడా అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి ఓ రివాల్వర్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. బయటపడ్డ బంగారం,వెండి,నగదును తహశీల్దార్,రెవెన్యూ అధికారుల సమక్షంలో లెక్కిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
ట్రెజరీ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మనోజ్ ఈ నిధి ఎక్కడినుంచి వచ్చిందన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దొంగల ముఠాతో సంబంధాలున్నాయా... లేక ఇవి గుప్త నిధులా అన్నది ఆరా తీస్తున్నట్లు తెలిపారు. పెట్టెలకు పంచానామా నిర్వహించామని... కౌంటింగ్ మెషిన్లతో క్యాష్ను లెక్కిస్తున్నామని చెప్పారు. ఇన్కమ్ ట్యాక్స్ సహా సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చామన్నారు. కాగా,మనోజ్పై గతంలోనూ అవినీతి ఆరోపణలున్నట్లు తెలుస్తోంది.