కాల్ మనీలో విష్ణు అనుచరులు?: బాబు ధైర్యం.. కొత్త కోణాలు, ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్!
విజయవాడ: కల్తీ మద్యం కేసులో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లాది విష్ణు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. తాజాగా, బెజవాడలో కలకలం రేపిన కాల్ మనీ వ్యవహారంలోనూ ఆయన వర్గం ఉన్నట్లుగా జోరుగా ప్రచారం సాగుతోంది.
విజయవాడ కృష్ణ లంకలోని స్వర్ణ బార్లో కల్తీ మద్యం మల్లాది విష్ణును చిక్కుల్లో నెట్టింది. ఆయన పైన ఎఫ్ఐఆర్ నమోదయింది. ఇప్పుడు మల్లాది విష్ణు అజ్ఞాతంలో ఉన్నారు. కల్తీ మద్యం తర్వాత రెండు రోజులుగా... కాల్ మనీ వ్యవహారం బెజవాడను కుదిపేస్తోంది.
కాల్ మనీ వ్యవహారంలో అధికార, విపక్షాలు అనే తేడా లేకుండా అన్ని పార్టీలకు చెందిన వారు ఉన్నారని చెబుతున్నారు. మల్లాది విష్ణు అనుచర వర్గానికి కూడా ఇందులో పాత్ర ఉందని పలువురు బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల్లో ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
మల్లాది విష్ణు అనుచరుడిగా భావిస్తున్న గణేష్ అనే వ్యక్తి రూ.లక్ష ఇచ్చి, అందుకు బదులుగా తమ వద్ద మూడు నాలుగు లక్షల రూపాయలు వసూలు చేశాడని ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గణేష్ తమ ఇంటిని కూడా లాక్కున్నాడని ఫిర్యాదు చేశారు. ఆమె విలేకరుల ఎదుట కన్నీటిపర్యంతమయ్యారు.
వెలుగు చూస్తున్న కాల్ మనీ దారుణాలు
కాల్ మనీ దందాలో ఎన్నో కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి. అవసరానికి అప్పులిచ్చి వారి నుంచి అంతకు ఎన్నో రెట్లు కాల్ మనీ నిందితులు వసూలు చేస్తున్నారు. ఇవ్వకుంటే బెదిరింపులకు గురి చేస్తున్నారు. కాల్ మనీ గ్యాంగ్ దారుణాలు ఎన్నో వెలుగు చూస్తున్నాయి.
బెజవాడలో దాదాపు 300 మంది వ్యాపారుల నుంచి అప్పులు తీసుకొని, వేలాది మంది బాధితులుగా మారినట్లు తెలుస్తోంది. బాధితులు పుస్తెలు కూడా అమ్ముకున్నారు. ఆస్తులు రాసిచ్చిన వారూ ఉన్నారు. చివరకు కాల్ మనీ వసూళ్ల నేపథ్యంలో భార్యాభర్తల మధ్య గొడవలు జరిగిన సందర్భాలూ ఉన్నాయి.
భర్త ఉండీ తాళి లేని పరిస్థితి పలువురు మహిళలు ఎదుర్కొంటున్నారు. లక్ష రూపాయలు ఇచ్చి.. వడ్డీ పేరుతో మూడు లక్షలు అంతకంటే ఎక్కువే వసూలు చేస్తున్నారు. మహిళలతో వ్యభిచారం చేయించేందుకు కూడా ప్రయత్నిస్తున్నారు.
ప్రభుత్వం, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ధైర్యం చెప్పడంతో మరింత మంది కాల్ మనీ బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వస్తున్నారు. బాధితులు ఎవరూ కాల్ మనీకి డబ్బులు కట్టవద్దని, బాధితులు ధైర్యంగా వచ్చి ఫిర్యాదు చేయాలని, కఠిన చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి చెప్పారు.
కాల్ మనీ ఏజెంట్స్ భర్తలు ఉన్నప్పుడు రారని, తన భర్త లారీ డ్రైవర్ అని, అతను ఉన్నప్పుడు రావాలని చెప్పినప్పటికీ రాత్రుళ్లు వచ్చి తలుపులు కొడతారని ఓ మహిళ వాపోయారు. తాను ప్రమీల అనే వద్ద డబ్బులు తీసుకున్నానని ఆమె చెప్పారు.
టిడిపి ఎమ్మెల్యేలకు క్లీన్ చిట్!
కాల్ మనీ కేసులో అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నట్లగా తెలియదని పోలీసులు చెబుతున్నారు. డిజిపి ఓ ఇంగ్లీష్ ఛానల్తో మాట్లాడుతూ... కాల్ మనీ కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎవరినీ వదిలిపెట్టేది లేదని చెప్పారు. ఎమ్మెల్యేల పాత్ర ఉన్నట్లుగా ఇప్పటి వరకు తెలియరాలేదన్నారు.