మంగళగిరి టీడీపీ ఆఫీసులో చంద్రబాబు 36 గంటలు దీక్షకు పోలీసుల అనుమతి
అమరావతి: తెలుగుదేశం పార్టీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్లపై దాడులను నిరసిస్తూ మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేపట్టనున్న 36 గంటల నిరవధిక నిరసన దీక్షకు పోలీసులు అనుమతి ఇచ్చారు. కరోనావైరస్ నిబంధనలు పాటిస్తూ దీక్ష చేపట్టాలని పోలీసులు సూచించారు. ఈ మేరకు అనుమతులకు సంబంధించి నోటీసులు బుధవారం టీడీపీ నేతలకు అందజేశారు.
టీడీపీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్లపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు చేసిన దాడికి నిరసనగా.. పార్టీ కార్యాలయంలో 36 గంటల పాటు నిరవధిక నిరసన దీక్ష చేపట్టనున్నట్లు చంద్రబాబు ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా పోలీసుల అనుమతి లభించడంతో.. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు టీడీపీ అధినేత చంద్రబాబు దీక్ష చేయనున్నారు.
ఈ దీక్షలో పార్టీకి చెందిన కీలక నాయకులు కూడా పాల్గొననున్నారు. మరోవైపు చంద్రబాబు దీక్షా సమయంలో టీడీపీ ప్రతినిధి బృందం రాష్ట్ర గవర్నర్ను కలిసి రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలపై వినతిపత్రం సమర్పించనున్నారు. అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కూడా టీడీపీ నేతలు కలువనున్నారు. రాష్ట్రంలో టీడీపీ నేతలపై, పార్టీ కార్యాలయాలపై జరుగుతున్న దాడులను ఆయనకు వివరించనున్నారు. ఇప్పటికే చంద్రబాబు ప్రధాని, కేంద్రమంత్రులకు లేఖలు రాసిన విషయం తెలిసిందే.
Recommended Video
కాగా, తమ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని టీడీపీ నేతలు దూషించారంటూ వైసీపీ శ్రేణులు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి చేశారు. ఫర్నీచర్ మొత్తం ధ్వంసం చేశారు. అలాగే.. టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభి ఇంటిపైనా వైసీపీ కార్యకర్తలు, జగన్ అభిమానులు దాడులకు పాల్పడ్డారు. ఈ దాడులపై టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ ముఖ్య నేతలు తీవ్రంగా స్పందించారు. ఈ దాడులను నిరసిస్తూ బుధవారం బంద్ ప్రకటించారు. దీనికి కొనసాగింపుగా.. గురువారం నుంచి చంద్రబాబు నిరవధిక దీక్ష చేపట్టనున్నారు. కాగా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీకి పోటీగా జనాగ్రహ దీక్షలు, నిరసనలు చేపట్టాలని నిర్ణయించింది.