ఎమ్మెల్యేపై దాడి ఘటనలో పాల్గొన్న మరో ఇద్దరు మావోయిస్టుల గుర్తింపు;పేర్లు:మైనో...మల్లేష్
విశాఖపట్టణం:అరకు
ఎమ్మెల్యే
కిడారి
సర్వేశ్వరరావు,
మాజీ
ఎమ్మెల్యే
సివేరి
సోమ
హత్యా
ఘటనలో
పాల్గొన్న
మరో
ఇద్దరు
మావోయిస్టులను
పోలీసులు
గుర్తించారు.
వీళ్ల,పేర్లు
ఫోటోలను
పోలీసులు
విడుదల
చేశారు.
వీళ్లలో ఒకరు నందపూర్ ప్రాంతీయ కమిటీ సభ్యుడైన మైనో అలియాస్ శంభు, కాగా మరొకరు అంపబల్లి, యేపలపాడు ప్రాంతాలకు బాధ్యుడైన మల్లేష్ అలియాస్ సునీల్ అలియాస్ మల్లా. వీరిరువురూ ఛత్తీస్గఢ్కు చెందినవారు కాగా ఇద్దరి వయస్సూ 29 ఏళ్లేనని తెలిసింది. దాడిలో వీళ్లు పాల్గొన్నట్లుగా ఆధారాలు లభ్యం అయ్యాయని పోలీసులు చెబుతున్నారు.
ఎమ్మెల్యే కిడారి,మాజీ ఎమ్మెల్యే సోమపై దాడికి సంబంధించి స్థానికుల నుంచి రాబట్టిన సమాచారం ఆధారంగా దాడిలో వీరు కూడా పాల్గొన్నట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారని తెలిసింది. మల్లేష్ అలియాస్ సునీల్ది దంతెవాడ జిల్లా గంగ్లూరు గ్రామం. ఇతడికి చత్తీస్ ఘడ్ రాష్ట్రంలోని రాయపూర్ వద్ద మొదలై ఒడిశా మీదుగా సాగి విజయనగరం జిల్లాలోని నాతవలస వద్ద ముగిసే 26వ నెంబరు జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న అంపబల్లి, యేపలపాడు తదితర ప్రాంతాల్లో మావోయిస్టు పార్టీ కార్యకలాపాల బాధ్యతలను అప్పగించినట్లు పోలీసులు వెల్లడించారు.
ఇక మరో మావోయిస్ట్ మైనో అలియాస్ శంభు నందపూర్ ప్రాంతంలో కీలకంగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు. ఏవోబీ ప్రత్యేక జోనల్ కమిటీ సభ్యురాలైన వెంకట చైతన్య అలియాస్ అరుణ నేతృత్వంలో జరిగిన ఈ దాడుల్లో సుమారు 60 మందికి పైగా మావోయిస్టులు పాల్గొనగా...వారిలో అరుణతో పాటు కామేశ్వరి అలియాస్ స్వరూప, శ్రీనుబాబు అలియాస్ రైనో అలియాస్ సునీల్లను దాడి మరుసటి రోజే గుర్తించిన సంగతి తెలిసిందే. వాళ్లు ముగ్గురు తెలుగువారు కాగా వీరిద్దరూ చత్తీస్ ఘడ్ వాసులు.
ఈ క్రమంలో పోలీసులు మావోలకు సంబంధించి మరికొన్ని వివరాలను వెల్లడించారు. ఛత్తీస్గఢ్లోని అబుజ్మడ్ ప్రాంతంలో పోలీసు ఇన్ఫార్మర్లను, తమకు వ్యతిరేకంగా వ్యవహరించేవారిని నిర్మూలించేందుకు మావోయిస్టులు ఒక ప్రత్యేక విధానాన్ని అనుసరిస్తారని పోలీసు అధికారులు చెబుతున్నారు. ముందుగా ఎవరిని చంపాలో వారిని ట్రాప్ లోకి లాగుతారు. ఆ తర్వాత దాడికి నేతృత్వం వహించే ముఖ్యమైన మావోయిస్టు నేతలు వారితో నేరుగా మాట్లాడుతూ వారు చేసిన తప్పులను వివరిస్తారు. ఆ తరువాత మావోయిస్టు సిద్ధాంతం గురించి వారికి తెలియచెబుతారు. ఈ ప్రక్రియ అంతా వేగంగా పూర్తి చేసి ఆ తర్వాత వారిని చంపేస్తారు.
మరోవైపు దాడిలో పాల్గొనే మిగతా సభ్యులు అదే సమయంలో అక్కడ ప్రజా కోర్టు నిర్వహిస్తుంటారు. ఇదీ ఇక్కడి మావోయిస్టులు అమలు చేసే విధానం. లివిటిపుట్టి వద్ద జరిగిన మావోల దాడి ఘటన ఇదే తరహాలో జరిగిందని పోలీసువర్గాలు విశ్లేషించాయి. ఈ దాడికి నేతృత్వం వహించిన మహిళా మావోయిస్ట్ అరుణ...నారాయణపూర్, నందపూర్ ప్రాంతీయ కమిటీల పర్యవేక్షణ బాధ్యతలు చూస్తుందని పోలీసులు వెల్లడించారు. వీటిలో నందపూర్ ఒడిశా రాష్ట్రంలో ఉండగా, నారాయణపూర్ ఛత్తీస్గఢ్లో ఉంది. అందుకే ఆమె ఈ దాడికి ఆయా ప్రాంతాల వారినే ఎక్కువగా సమీకరించినట్లు పోలీసులు భావిస్తున్నారు.