నందిగామ మహిళ హైదరాబాదులో సజీవ దహనం
హైదరాబాద్: హైదరాబాదులోని పంజాగుట్టలో సజీవ దహనమైన మహిళ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. సజీవ దహనమైన మహిళను పూజితగా పోలీసులు గుర్తించారు. పూజిత స్వస్థలం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లా నందిగామ. పూజిత విజయవాడలో సీఏ చదువుతోంది. పూజిత తల్లిదండ్రులకు పోలీసులు సమాచారం అందించారు. పూజిత సెల్ఫోన్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆమెది ఆత్మహత్యనా, హత్యనా అనే విషయాన్ని తేల్చుకునే పనిలో వారు పడ్డారు.
నగరం నిద్రపోతున్న వేళ.. ఓ యువతి అనుమానాస్పదస్థితిలో సజీవ దహనానికి గురైంది. నగరం నడిబొడ్డున ఉన్న పంజాగుట్ట కాలనీలోని ఐఏఎస్ క్వార్టర్స్ పార్కులో ఈ దారుణం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పంజాగుట్ట కాలనీ ఐఏఎస్ క్వార్టర్స్లోని జీహెచ్ఎంసీ పార్కులో శుక్రవారం ఉదయం పూర్తిగా కాలిపోయిన ఓ యువతి మృతదేహాన్ని స్థానికులు గుర్తించారు.
సమాచారం అందుకున్న పోలీసులు, క్లూస్ టీం సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. ఘటనాస్థలంలో పెట్రోల్ బాటిల్, అగ్గిపెట్టె, మృతురాలి చెప్పులు, బ్యాగు, కొన్ని మద్యం బాటిళ్లను క్లూస్టీమ్ స్వాధీనం చేసుకున్నది. హత్య దర్యాప్తులో భాగంగా పోలీసు జాగిలాలను రప్పించగా, అమీర్పేట బిగ్బజార్ వెనుక వరకు వెళ్లి ఆగిపోయాయి. మృతిచెందిన యువతి 20-25 ఏండ్ల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు. అనుమానాస్పదస్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసి, భిన్న కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.
సంఘటన స్థలాన్ని వెస్ట్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్రావు, ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ మోహన్కుమార్ సందర్శించారు. ఘటన గురువారం రాత్రి 11 నుంచి 12 గంటల మధ్య జరిగి ఉంటుందని భావిస్తున్నారు. మృతురాలి చేతికి ఉన్న గడియారం రాత్రి 11.30 గంటలకు ఆగిపోయింది. అంతకు 15 నిమిషాల ముందు మంటలు అంటుకొని ఉండే అవకాశాలున్నాయని పోలీసులు భావిస్తున్నారు.
సంఘటన స్థలంలో మద్యం మత్తులో గుర్తుతెలియని వ్యక్తుల చేతిలో యువతి దహనమైందా? లేక మద్యం మత్తులో ఆమే కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడిందా? అన్న అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, పంజాగుట్ట నుంచి ఐఏఎస్ క్వార్టర్స్ వెళ్లే అన్ని దారుల్లోనున్న సీసీ కెమెరాల పుటేజీలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని డీసీపీ వెంకటేశ్వర్రావు తెలిపారు.
మూడు బృందాలతో దర్యాప్తు: నాయిని
పంజాగుట్ట పార్కులో యువతి సజీవ దహనం ఘటనపై హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి శాసనసభలో శుక్రవారం ప్రకటన చేశారు. ఈ ఘటనపై మూడు పోలీసు బృందాలతో దర్యాప్తు చేయిస్తున్నామన్నారు. హత్యా లేక ఆత్మహత్యా అన్న కోణంలో దర్యాప్తు జరుగుతున్నదని ఆయన అన్నారు.