పోలీసుల వైఫల్యం లేదు: ఎమ్మెల్యే హత్యపై హోంమంత్రి, వారి పనేనా?
అరకు/విశాఖపట్నం: మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమ స్మారకస్థూపాలు ఏర్పాటు చేస్తామని హోంమంత్రి చినరాజప్ప తెలిపారు. కుటుంబ సభ్యుల విజ్ఞప్తి మేరకు స్మారక స్థూపాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం లేదన్నారు.
Recommended Video
పోలీసులను టార్గెట్ చేయడం అర్థం లేదని, శాంతిభద్రతలను కాపాడేందుకు వారు శ్రమిస్తున్నారన్నారు. అంత్యక్రియల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారన్నారు. ప్రజలు సంయమనం పాటించాలన్నారు. రాత్రి అరకులో పోస్టు మార్టం నిర్వహిస్తామని చెప్పారు. అరకులో సోమవారం ఉదయం అంత్యక్రియలు జరుగుతాయని చెప్పారు.
తెలంగాణ ఆపద్ధర్మ హోంమంత్రి ఖండన
ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేను కాల్చి చంపడాన్ని తెలంగాణ ఆపద్ధర్మ హోంమంత్రి నాయిని నర్సింహా రెడ్డి తీవ్రంగా ఖండించారు. అరకు ఘటన నేపథ్యంలో తెలంగాణలో అప్రమత్తంగానే ఉన్నట్లు తెలిపారు. నాయకులకు భద్రత కల్పిస్తున్నామని చెప్పారు.
ఎవరి పని?
వీరి హత్యపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. 2016లో జరిగిన ఎన్కౌంటర్కు ప్రతీకారంగానే వీరిని చంపి ఉంటారని అనుమానిస్తున్నారు. 2016 నాటి ఎన్కౌంటర్లో 30 మంది మావోయిస్టులు హతమయ్యారు. నాటి నుంచి వారి ఉనికి అంతగా లేదు. తమ ప్రాబల్యం చూపించుకోవడానికి హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు. తొలుత రామకృష్ణ ఆధ్వర్యంలో ఈ దాడి జరిగినట్లుగా వార్తలు వచ్చాయి. ఇప్పుడు ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి ఆధ్వర్యంలో ఇది జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు.