ఛలో అసెంబ్లీ టెన్షన్: టీడీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు..షాడో పార్టీలు: శవాల మీద వెళ్లి...!
రాజధానుల వ్యవహారంపై తేల్చేసేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ప్రత్యేక అసెంబ్లీ సమావేశాల సమయం దగ్గర పడింది. ఇదే సమయంలో ప్రభుత్వ వ్యూహాలకు ధీటుగా అటు సభ లోపలా..బయటా ఒత్తిడి పెంచే వ్యూహాలను ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అమలు చేస్తోంది. ఇప్పటికే అసెంబ్లీలో అనుసరించాల్సిన వ్యూహం పైన టీడీపీ శాసనసభా పక్షం సమావేశమైంది.
ఇదే సమయంలో టీడీపీ..అమరావతి జేఏసి ఛలో అమరా వతి..జైల్ భరోకు పిలుపునిచ్చారు. దీంతో..పోలీసులు అప్రమత్తమయ్యారు. టీడీపీ నేతలకు నోటీసులు ఇచ్చారు. ముఖ్య నేతల వెంబటి షాడో పార్టీలు అనుసరిస్తున్నాయి. దీని పైన టీడీపీ నేతలు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. తమ శవాల మీద వెళ్లి బిల్లు పాస్ చేసుకోవాలని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు.
టీడీపీ నేతలకు నోటీసులు..
రాజధానుల వ్యవహారం పైన ఏపీ అసెంబ్లీ ప్రత్యేకంగా సమావేశం అవుతోంది. ఇదే సమయంలో టీడీపీ..అమరావతి జేఏసీ ఛలో అసెంబ్లీకి పిలుపునిచ్చింది. అసెంబ్లీ లోపల టీడీపీ..బయట ఛలో అసెంబ్లీ నిర్వహ ణ ద్వారా ప్రభుత్వం పైన ఒత్తిడి పెంచాలని చంద్రబాబు వ్యూహం సిద్దం చేస్తున్నారు. దీంతో..పోలీసులు ముందస్తు చర్యలు ప్రారంభించారు.
తెలుగుదేశం పార్టీ నేతలకు సెక్షన్ 149 కింద పోలీసులు నోటీ సులు ఇచ్చారు. టీడీపీ నేతల ఇళ్ల తలుపులకు నోటీసులు అంటించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే ముందస్తు అరెస్ట్లు, గృహ నిర్బంధాలు ఉంటాయన్నారు. టీడీపీ శాసనసభాపక్ష ఉపనేత అచ్చెన్నాయుడుకూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. తాను ఎమ్మెల్యేనని, సభకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పినా పోలీసులు వినలేదు. టీడీఎల్పీ భేటీకి వస్తుండగా అచ్చెన్నాయుడు వెంట షాడో పార్టీలు అనుసరించాయి. కొందరు టీడీపీ నేతలవెంట పోలీసు షాడో పార్టీలు అనుసరిస్తున్నాయి.
పోలీసుల హెచ్చరికలు..
జేఏసీ సోమవారం తలపెట్టిన అసెంబ్లీ ముట్టడిని అడ్డుకునేందుకు పోలీసుశాఖ చర్యలు చేపట్టింది. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ నేతలు ఎవరూ ఇళ్లలో నుంచి బయటకు రాకుండా వారికి ముందుగానే నోటీసులు ఇస్తున్నారు. విజయవాడ గొల్లపూడిలో ఉంటున్న మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు, విద్యాధరపురంలో నివాసం ఉంటున్న సీనియర్ నాయకుడు వర్ల రామయ్య, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నకు నోటీసులు ఇచ్చారు.
వారి ఇంటికి నోటీసులు అంటించారు. స్థానిక ప్రజాప్రతినిధుల ఇళ్లకు కూడా ఈ నోటీసులు ఇచ్చారు. కాగా జేఏసీ పిలుపు ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి కి అనుమతి లేదని ఐజీ వినీత్ బ్రిజ్లాల్ చెప్పారు. రాజధాని ప్రాంతంలో 144 సెక్షన్తోపాటు 30 పోలీస్ యాక్టు అమలులో ఉన్నట్లు వివరించారు. వీటిని దృష్టిని ఉంచుకుని అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విరమించుకోవాలని సూచించారు.
శవాల మీద నండి వెళ్లి పాస్ చేసుకోండి..
పోలీసుల ప్రవర్తన ఎమర్జెన్సీని తలపిస్తోందని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మండిపడ్డారు. సోమవారం అసెంబ్లీ ముట్టడికి భారీ ర్యాలీగా తరలి వెళతామని..ఎవరు అడ్డుకుంటారో చూస్తామని అన్నారు. బుల్లెట్లకు ఎదురొడ్డి.. ప్రాణాలైనా త్యాగం చేస్తామని అన్నారు. తమ శవాల మీద నుంచి వెళ్లి బిల్లు పాస్ చేసుకోవాలని అన్నారు.
అసెంబ్లీ ముట్టడిని సీఎం జగన్మోహన్ రెడ్డి తాత కూడా ఆపలేరని, ఇది ప్రజా ఉద్యమమని అన్నారు. చంద్రబాబుకు పేరు వస్తుందని రాజధాని మార్చడం తగదని, వైసీపీకి ఓట్లేసిన ప్రజల నోట్లో జగన్ మట్టికొడుతున్నారని బుద్ధా వెంకన్న మండిపడ్డారు. దీంతో..అటు అసెంబ్లీలో నిర్ణయం.. ఇటు నిరసన కార్యక్రమాలతో సోమవారం ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం కనిపిస్తోంది.