ఉక్కు పరిశ్రమ కోసం ఉద్యమిస్తున్న విద్యార్థి నేతలపై లాఠీఛార్జి,ఒకరి పరిస్థితి విషమం
కడప:కడప ఉక్కు పరిశ్రమ సాధనకోసం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులపై పోలీసుల లాఠీ చార్జీ చేశారు. దీంతో యోగివేమన యూనివర్సిటీ ఎస్ఎఫ్ఐ కార్యదర్శి రమేష్ నాయక్ సొమ్మసిల్లిపడిపోయాడు.
అతడి పరిస్థితి విషమించడంతో సిపిఎం జిల్లా కార్యదర్శి కె. ఆంజనేయులు వెంటనే రమేష్ నాయక్ను చేతులపై ఎత్తుకుని రోడ్డుపై బైటాయించి నిరసన తెలిపేందుకు సంసిద్ధం కాగా పోలీసులు బలవంతంగా రిమ్స్కు తరలించారు. వైద్యులు బాధితునికి వైద్య పరీక్షలు నిర్వహించారు. పరిస్థితి కొంత ఆందోళనకరంగా ఉండటంతో అతడిని తిరుపతి స్విమ్స్కు తరలించారు.
ఈ విద్యార్థి ఆరోగ్య పరిస్థితిపై స్పష్టత రావాలంటే మరో 40 గంటలు పరిశీలించాలని రిమ్స్ వైద్యులు చెబుతున్నారు. ప్రధానంగా బాధితుని పక్కటెముకలు, గొంతు భాగంలో తీవ్ర అంతర్గత గాయాలు అయినట్లు వైద్యులు చెబుతున్నట్లు తెలిసింది. శుక్రవారం కలెక్టరు కార్యాలయం వద్ద ధర్నాకు దిగిన 20 మంది ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ నాయకులను అరెస్టు చేసి వల్లూరు పోలీసు స్టేషన్కు తరలించారు.
ఉక్కు సాధనకోసం నాలుగురోజులగా పాదయాత్రలు నిర్వహించిన ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాలు శుక్రవారం కలెక్టరేట్ కార్యాలయం వద్ద శాంతియుతంగా ధర్నా చేస్తుండగా పోలీసుల లాఠీ చార్జీ చేయడం ప్రభుత్వ నియంతృత్వానికి నిదర్శనంగా వామపక్షాల నేతలు అభివర్ణిస్తున్నారు. లాఠీచార్జీలో గాయపడిన విద్యార్థి నాయకుడు రమేష్ నాయక్ను సిపిఎం కడప జిల్లా కార్యదర్శి కారు ఆంజనేయులు, రాష్ట్ర కమిటీ సభ్యులు నారాయణరెడ్డి పరామర్శించారు. ఈ మేరకు విద్యార్థి ఆరోగ్య పరిస్థితిని అక్కడి వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
ప్రభుత్వం ఇలా పోలీసులను అడ్డుపెట్టుకుని ఉద్యమకారులపై ఈ విధమైన దాడులకు పాల్పడాన్ని వామపక్షాలతో పాటు ప్రజాసంఘాలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఈ సంఘటనపై శనివారం అఖిల పక్ష పార్టీలు, విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా విద్యాసంస్థల బంద్కు పిలుపునిచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.