మండలి ఛైర్మన్పై ఘాటు పదజాలం ఫలితం: ముగ్గురు మంత్రులపై కేసు నమోదు.. !
గుంటూరు: శాసన మండలి ఛైర్మన్ మహ్మద్ షరీఫ్పై ఘాటు పదజాలంతో విమర్శలు చేసిన ముగ్గురు మంత్రులపై గుంటూరు అర్బన్ పోలీసు సూపరింటెండెంట్ కార్యాలయం పరిధిలో కేసు నమోదైంది. ఏపీ వికేంద్రీకరణ బిల్లును శాసన మండలి ఛైర్మన్ హోదాలో మహ్మద్ షరీఫ్.. సెలెక్ట్ కమిటీకి పంపించడం పట్ల ఆయనపై వైఎస్ఆర్సీపీ సభ్యులు, మంత్రులు తీవ్రంగా విరుచుకుపడినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆయనను ఘాటు పదజాలంతో దూషించినట్లు వార్తలు వచ్చాయి.
వాటిని దృష్టిలో ఉంచుకుని.. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, ఏపీ మైనారిటీల ఆర్థిక సంస్థ మాజీ ఛైర్మన్ మహ్మద్ హిదాయత్.. గుంటూరు అర్బన్ ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. మంత్రులు బొత్స సత్యనారాయణ, కొడాలి నాని, అనిల్కుమార్ యాదవ్ పేర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఙప్తి చేశారు. ఈ మేరకు లిఖితపూరక ఫిర్యాదును ఎస్పీకి అందజేశారు. మైనారిటీలకు చెందిన నాయకుడు, మండలి ఛైర్మన్ హోదాలో ఉన్న వ్యక్తిపై మంత్రులు ఘాటు పదజాలాన్ని ప్రయోగించారని అన్నారు.
శాసన మండలిలో ఏపీ వికేంద్రీకరణ బిల్లును తెలుగుదేశం పార్టీ సభ్యులు అడ్డుకోవడం పట్ల అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, సభ్యులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా బొత్స సత్యానారాయణ సహా పలువురు సీనియర్ నాయకులు, తోటి మంత్రులు మండలి ఛైర్మన్ షరీఫ్ను టార్గెట్గా చేసుకుని మతం పేరుతో దూషించినట్లు వార్తలు వచ్చాయి. దీనికి సంబంధించిన పేపర్ క్లిప్పింగులను కూడా మైనారిటీ నాయకులు తమ ఫిర్యాదు పత్రానికి జత చేశారు.
అనంతరం వారు హిదాయత్ విలేకరులతో మాట్లాడారు. మంత్రులపై విరుచుకుపడ్డారు. మైనారిటీలకు ప్రతినిధులమని చెప్పుకొంటున్న అధికార పార్టీ నాయకులు అదే మైనారిటీ వర్గానికి చెందిన మండలి ఛైర్మన్పై అనరాని మాటలు అన్నారని, మతం పేరుతో దూషించాని ఆరోపించారు. మండలి ఛైర్మన్ను రాజకీయాల్లోకి లాగడం సరికాదని చెప్పారు. రాజకీయాలకు అతీతంగా మండలి స్థానాన్ని గౌరవించాల్సి ఉన్నప్పటికీ.. మంత్రులు దీనికి భిన్నంగా ప్రవర్తించారని అన్నారు.