పోలీసులే సివిల్ డ్రెస్సులో వచ్చి రాళ్లేశారు, గిల్లుకుంటూ తీసుకెళ్లారు: ఎంపీ గల్లా జయదేవ్
అమరావతి రాజధాని కోసం ఆందోళన చేస్తున్న తమపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని ఎంపీ గల్లా జయదేవ్ తెలిపారు. వారం రోజుల క్రింద పోలీసులు ప్రవర్తించిన తీరును కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేస్తామని చెప్పారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అనుసరించాల్సిన వ్యుహంపై పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. అమరావతిలో తమపై పోలీసుల దాడిని కూడా ప్రధాని మోడీ దృష్టికి తీసుకెళతామని గల్లా జయదేవ్ వెల్లడించారు.
పోలీసులే వేశారు..
వారం క్రితం జరిగిన ఘటనలో తాము రాళ్లు వేయలేదని, తమ ప్రతినిధులు కూడా వేయలేదన్నారు. సివిల్ డ్రెస్సులో వచ్చిన పోలీసులే వేశారని చెప్పారు. తాము వచ్చేప్పుడు మట్టి తీసుకెళ్తున్న వాహనం కనిపించిందని గుర్తుచేశారు. ప్రణాళిక పర్కారం పోలీసులే రాళ్లు వేసి.. తిరిగి తమపై దాడి చేశారని చెప్పారు. అక్కడున్న కొందరు తనను రక్షించే ప్రయత్నం చేశారని తెలిపారు. అక్కడే ఉన్న గుంటూరు రూరల్ ఎస్పీ, అక్టోపస్ ఎస్పీ విశాల్ గున్నీ మాత్రం పోలీసుల చర్యను చూసీచూడనట్టు వ్యవహరించారని పేర్కొన్నారు.
42 రోజులుగా ఆందోళన
అమరావతిలో 42 రోజులుగా ఆందోళనలు జరుగుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలు స్పందించలేదని చెప్పారు. ఇదివరకు మహిళలు తమను పోలీసులు గిచ్చుతున్నారని చెప్పేవారు.. అదీ తాను అనుభవిస్తే తప్ప అర్థం కాలేదన్నారు. వారం అవుతోన్నా ఇంకా నొప్పి తగ్గలేదని చెప్పారు. ఒక ఎంపీతోనే ఇలా వ్యవహరిస్తే.. సాధారణ ప్రజలతో ఎలా ప్రవర్తిస్తారో చూడాలన్నారు. జరిగిన ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ లేకుండా జాగ్రత్త పడ్డారని చెప్పారు. ఇది ఒక్క పోలీసు కాదు.. పోలీసులు చేసిన చర్య అని పేర్కొన్నారు. దీనిని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, హోంమంత్రి అమిత్ షా, మహిళా కమిషన్, మావన హక్కుల కమిషన్కు కూడా ఫిర్యాదు చేస్తామని చెప్పారు.
ఏం జరగలేదని జయదేవ్
తనపై పోలీసులు చేసిన దాడి గాయాలను ఎంపీ గల్లా జయదేవ్.. నారా లోకేశ్కు చూపించారు. చలో అసెంబ్లీ కార్యక్రమం హింసాత్మకంగా ఏం జరగలేదని జయదేవ్ పేర్కొన్నారు. పోలీసులు కావాలనే హింసాత్మకంగా మార్చారని తెలిపారు. అశాంతి రగిల్చి.. తమపై భౌతిక దాడులకు తెగబడ్డారని చెప్పారు. దీనిపై తాము పోరాడుతామని, మరొకరిపై దాడి చేయాలంటే భయపడేలా చర్యలు తీసుకునేందుకు పోరాడుతామన్నారు.