నాడు ప్రజలు అచ్చెన్నను చితక్కొడితే కాపాడింది పోలీసులే ... మర్చిపోవద్దని పోలీస్ అధికారుల సంఘం ఫైర్
నిన్న పోలీసులను యూజ్లెస్ ఫెలోస్ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంది. ఎస్పీ విక్రాంత్ పాటిల్ పై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తోంది. అంతే కాదు అచ్చెన్నకు సీరియస్ వార్నింగ్ కూడా ఇచ్చింది .
ఛలో పల్నాడు సందర్భంగా పోలీసులపై అచ్చెన్నాయుడు తీవ్ర వ్యాఖ్యలు
ఛలో పల్నాడు సందర్భంగా టీడీపీ శ్రేణులు ఛలో ఆత్మకూరు కార్యక్రమాన్ని నిర్వహించడానికి వెళుతున్న క్రమంలో పోలీసులు అడ్డుకున్నారు. ఇక అడ్డుకున్న పోలీసులపై టిడిపి నేతలు వీరంగం వేశారు. పోలీసులపై మాజీ మంత్రి అచ్చెన్నాయుడు అయితే పోలీసులపై తీవ్ర పదజాలంతో దూషించారు. ఎస్పీ విక్రాంత్ పాటిల్ని ఉద్దేశించి యూజ్ లెస్ ఫెలోస్ అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు నివాసానికి టూ వీలర్ పై బయలుదేరిన మాజీ మంత్రి అచ్చెన్నాయుడిని అడ్డుకున్న పోలీసులు బలవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
ఏయ్ ఎగస్ట్రాలు చెయ్యొద్దు అంటూ ఎస్పీని దూషించిన అచ్చెన్న
ఈ సందర్బంగా పోలీసులతో అచ్చెన్నాయుడికి తీవ్ర వాగ్వాదమైంది. ఇక ఈ సందర్భంలో అచ్చెన్నాయుడు పోలీసులను దూషించారు. ఆగ్రహంతో ఊగిపోయిన అచ్చెన్నాయుడు చంద్రబాబు ఇంటి వద్ద ఎస్పీ విక్రాంత్ పాటిల్ అచ్చెన్నాయుడు లోపలికి వెళ్లకుండా అడ్డుకున్న నేపధ్యంలో ఏయ్ ఎగస్ట్రాలు చెయ్యొద్దు , నన్ను ఆపే హక్కు నీకు ఎవడిచ్చాడు అంటూ పోలీసులపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న అధికారుల సంఘం ..
144 సెక్షన్ గురించి తెలియకపోవడం సిగ్గు చేటని మండిపాటు
ఇక ఈ ఘటనతో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ను దుర్భాషలాడారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఇది పోలీసు అధికారుల సంఘం చాలా సీరియస్ గా తీసుకుంది. ఎస్పీ విక్రాంత్ పాటిల్ పై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలు సరికాదంటూ ఏపీ పోలీస్ అధికారుల సంఘం మండిపడింది. గతంలో మంత్రిగా పనిచేసిన అచ్చెన్నాయుడుకు పలు సందర్భాల్లో ఆయనను పోలీసులు కాపాడారని గుర్తు చేసింది. మంత్రిగా పనిచేసిన ఆయనకు 144 సెక్షన్ గురించి తెలియకపోవడం సిగ్గు చేటు అంటూ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు మండిపడ్డారు.
గత ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడినప్పుడు అచ్చెన్నను కొడుతుంటే కాపాడింది పోలీసులే అని ఎద్దేవా
గత ఎన్నికల్లో రిగ్గింగ్కు పాల్పడినప్పుడు ప్రజలు అచ్చెన్నాయుడిని చితక్కొడుతుంటే కాపాడింది పోలీసులే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని హితవు పలికారు పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసరావు. అంతేకాదు పోలీసులు ప్రజలకు సేవలు అందిస్తున్నారని, అలాంటి పోలీసులు ఇష్టారాజ్యంగా మాట్లాడటం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల పట్ల మరొకసారి అమర్యాదగా ప్రవర్తిస్తే సరైన బుద్ధి చెప్తామని హెచ్చరించారు.
ఓ సిఐ ఎంపీనో , ఎమ్మెల్యేనో కాగలడు.. మీరు సిఐ కాగలరా ? అని ప్రశ్న
ఇక గోరంట్ల మాధవ్ ను ఉద్దేశించి చెప్తూ సీఐగా పని చేసిన గోరంట్ల మాధవ్ ఎంపీగా ప్రజలకు సేవలు అందిస్తున్నారని, అచ్చెన్నాయుడు మీరు సీఐ కాగలరా అంటూ నిలదీశారు. మీకా అర్హత ఉందా అని శ్రీనివాసరావు ప్రశ్నించారు. పోలీస్ శాఖలో పని చేసేవారు ఎక్కడైనా సేవలందించడానికి సిద్ధంగా ఉంటారని తమ శాఖ గొప్పతనాన్ని ప్రశంసించారు. ఇక మాజీ మంత్రి అచ్చన్న తీరుపై డీజీపీ కి, ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని చెప్పిన పోలీస్ అధికారుల సంఘం నేతలు ఒక్క అచ్చెన్నాయుడు మాత్రమే కాదు, మరెవరికి పోలీసులను అవమానించడం సమంజసం కాదని హితవు పలికారు.