ఎస్పీవా, వైసీపీ సోషల్ మీడియా కోఆర్డినేటర్వా- గుంటూరు ఎస్పీపై లోకేష్ ఫైర్
ఏపీలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ మధ్య సాగుతున్న మాటల యుద్ధంలో అధికారులూ నలిగిపోక తప్పడం లేదు. తాజాగా గుంటూరు జిల్లా పొన్నూరులో పోలీసులు అదుపులోకి తీసుకున్న టీడీపీ కార్యకర్త మణిరత్నం విషయంలో పోలీసులకూ, టీడీపీ ఎమ్మెల్సీ నారా లోకేష్కూ మధ్య సోషల్ మీడియా వార్ పరాకాష్టకు చేరింది.
Without a complaint being filed, without a case being registered, Mani was called to the police station on the pretext of the Social Media Post. He was forced to sign on blank papers. Has @spguntururban Sir become the Social Media coordinator of YSRCP?(1/3) pic.twitter.com/W4NAJ3uCXG
— Lokesh Nara #StayHomeSaveLives (@naralokesh) November 26, 2020
పొన్నూరు ఎమ్మెల్యే కిలారు రోశయ్య సగం కట్టిన గోడకు ప్రారంభోత్సవం చేయడంపై టీడీపీ కార్యకర్త మణిరత్నం రెండు రోజుల క్రితం వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టాడు. ఇది వైరల్ కావడంతో గుంటూరు పోలీసులు రంగంలోకి దిగి మణిరత్నాన్ని తీసుకెళ్లారు. పోలీసుల తీరుపై స్పందించిన టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్.. ఆగ్రహం వ్యక్తం చేశారు.
సగం కట్టిన గోడకు ప్రారంభోత్సవం చేయడమే ఓ వింత అయితే దాన్ని వీడియో తీసిన వ్యక్తిని అరెస్టు చేయడం మరో దారుణమంటూ నిన్న లోకేష్ ట్వీట్ చేశారు. దీనిపై స్పందించిన గుంటూరు ఎస్పీ మణిరత్నం ఇది తప్పుడు వార్తగా ప్రకటించారు. తప్పుడు ప్రచారం ఆపకపోతే చర్యలు తప్పవని లోకేష్, చంద్రబాబును హెచ్చరించారు.
తిరిగి ఇవాళ గుంటూరు ఎస్పీ అమ్మిరెడ్డి మరో ట్వీట్లో మణిరత్నాన్ని ప్రశ్నించేందుకు పోలీసు స్టేషన్కు పిలిపించామంటూ ప్రకటించారు. దీంతో గుంటూరు ఎస్పీ తీరుపై లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్పీవా, వైసీపీ సోషల్ మీడియా కో ఆర్డినేటర్వా అంటూ లోకేష్ ట్వీట్లో ప్రశ్నించారు. చట్టపరిధి దాటి ప్రవర్తించొద్దని, లేదంటే తీవ్ర ఇబ్బందుల్లో పడతారని హెచ్చరించారు. మణిరత్నం అరెస్టుపై అమ్మిరెడ్డి నిన్న ఓ మాట, ఇవాళ ఓ మాట మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రజలకు భావప్రకటన స్వేచ్ఛ లేదా అని ప్రశ్నించారు.
అయినా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిని ప్రశ్నించడానికి మీరెవరంటూ లోకేష్ గుంటూరు ఎస్పీని సూటిగా ప్రశ్నించారు.రాజ్యాంగం కల్పించిన భావప్రకటన స్వేచ్ఛను హరించే అధికారం పోలీసులకు ఎక్కడుందన్నారు. ఫిర్యాదు, కేసు లేకుండా పౌరులను ఎలా వేధిస్తారని లోకేష్ ప్రశ్నించారు. పోలీసుల బాధ్యత ప్రజలకు సేవ చేయడమే కానీ, రాజకీయ యజమాని కోసం పనిచేయడం కాదన్నారు. మణిరత్నాన్ని స్టేషన్కు పిలిపించి తెల్ల కాగితాలపై సంతకాలు పెట్టించుకున్నారని లోకేష్ ఆరోపించారు. జరిగిన ఘటనపై మణిరత్నం మాట్లాడిన వీడియోను లోకేష్ ట్విట్టర్లో పోస్టు చేశారు.