జనావాసాల్లోనే వ్యభిచారం : పోలీసుల రైడ్, ముఠా గుట్టురట్టు
తాడేపల్లిగూడెం (అర్బన్) : పట్టణంలోని హౌజింగ్ బోర్డు కాలనీలో జనావాసాల మధ్యనే వ్యభిచార దందా నడిపిస్తోన్న ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. గురువారం రాత్రి మెరుపుదాడులు నిర్వహించి నలుగురు నిర్వాహకులతో పాటు ఇద్దరు విటులను అదుపులోకి తీసుకున్నారు. దాడిలో భాగంగా.. విటుల నుంచి ఓ కారు, బైక్, నాలుగు సెల్ ఫోన్లను స్వాధీనపరుచుకున్నారు.
మరునాడు సర్కిల్ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టి స్థానిక సీఐ మూర్తి పలు వివరాలు వెల్లడించారు. హౌజింగ్ బోర్డులో వ్యభిచార కార్యకలాపాలు సాగుతున్నాయన్న సమాచారం మేరకు పట్టణ ఎస్ఐలు, సీఐలతో కలిసి మెరుపుదాడి చేసినట్టుగా తెలిపారు. దాడుల్లో వ్యభిచార ముఠాకు చెందిన తురాయి రవి, తురాయి లక్ష్మి, కొత్త శ్రీనివాస, బాల మాణిక్యాలరావు, పీ&టీ కాలనీకి చెందిన పుట్టాదేవితో పాటు విటులు మోర్ల వెంకట పెద్దిరాజు, సికిలే సతీశ్ కుమార్ లను అరెస్టు చేశారు.
కేటరింగ్ పేరిట... విటులను కారు ద్వారా వ్యభిచార గృహానికి తరలిస్తున్నారని సీఐ పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చేవారినే టార్గెట్ గా చేసుకుని వ్యభిచార గృహాలను నడిపిస్తున్నట్టుగా తెలియజేశారు. అమాయకులైన ఎందరో ఆడపిల్లలు ముఠా అఘాయిత్యాలకు బలైపోతున్నారని సీఐ ఆవేదన చెందారు.
బాధిత మహిళల్లో అరకుకు చెందిన ఓ యువతితో పాటు, జిల్లాకే చెందిన మరో ఇద్దరు మహిళలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. యువతను పెడదోవ పట్టించే ఇలాంటి అసాంఘీక కార్యకలాపాలను ఏమాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు సీఐ.