కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదు..!!
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదైంది. ఎమ్మెల్యేతో సహా మరో ఇద్దరి పైన వైసీపీ నేత ఫిర్యాదు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిపై కేసు నమోదైంది. కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాల్లో కోటంరెడ్డి సంచలనంగా మారారు. సొంత ప్రభుత్వం పైన ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు చేసారు. దీనిని ప్రభుత్వం ఖండించింది. ఈ మొత్తం వ్యవహారం పైన ఆరా తీస్తోంది. ఇదే సమయంలో కోటంరెడ్డి టీడీపీలో చేరనున్నట్లు ప్రకటించారు. దీంతో నెల్లూరు రూరల్ నియోజకవర్గ వైసీపీ బాధ్యతలను ఎంపీ ఆదాల ప్రభాకర్ రెడ్డికి ముఖ్యమంత్రి జగన్ అప్పగించారు. నియోజకవర్గంలో వైసీపీ నేతలు కోటంరెడ్డితో కాకుండా.. పార్టీ కోసమే పని చేసేలా కార్యాచరణ ప్రారంభించింది. ఈ ఆసక్తి కర పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు కోటంరెడ్డితో సహా మరో ఇద్దరి పైన నెల్లూరు జిల్లా వేదాయపాళెం పోలీసు స్టేషన్ లో కేసు నమోదు అయింది.
నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇప్పుడు కోటంరెడ్డి స్థానంలో ఎంపీగా ఉన్న ఆదాల ప్రభాకర్ రెడ్డి పార్టీ ఇంఛార్జ్ గా నియమితులయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆయనే పోటీ చేస్తారని పార్టీ ప్రకటించింది. దీంతో..ఇప్పటి వరకు నియోజకవర్గంలో కోటంరెడ్డికి మద్దతుగా నిలిచిన వైసీపీ నేతలు ఆదాలకు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. కోటంరెడ్డికి అనుచరులుగా ఉన్న నెల్లూరు కు చెందిన ఇద్దరు కార్పోరేటర్లు తాజాగా ఆదాలకు మద్దతు ప్రకటించారు. ఆదాల నాయకత్వంలోనే పని చేస్తామని వెల్లడించారు. కోటంరెడ్డి తమను టీడీపీలోకి రమ్మని కోరారని..టీడీపీలోకి వెళ్లేందుకు తాము సిద్దంగా లేమని ఇద్దరు కార్పోరేటర్లు స్పష్టం చేసారు. 22వ డివిజన్ కార్పోరేటర్ విజయ భాస్కర్ రెడ్డి తన కార్యాలయంలో కోటంరెడ్డి ఫెక్సీలను తీసేసారు. తాము జగన్ నాయకత్వంలోనే వైసీపీలోనే పని చేస్తామని స్పష్టం చేసారు. దీంతో..ఆయనకు కోటంరెడ్డితో పాటుగా ఆయన అనుచరుల నుంచి బెదిరింపులు వచ్చాయని ఫిర్యాదు చేసారు.
ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఫోనుచేసి తన అంతు చూస్తామని బెదిరించారని కార్పోరేటర్ విజయ భాస్కర రెడ్డి పోలీసులకు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంటికి వచ్చి భయాందోళనకు గురిచేయటంతో పాటుగా తనను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నించారని వివరించారు. తన ఇంటికి వచ్చి భయాందోళనకు గురిచేసిన ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కోరారు. విజయ భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు వేదాయపాళెం పోలీసు స్టేషన్ లో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డితో పాటుగా అనుచరులు మిద్దె మురళీకృష్ణ యాదవ్, అంకయ్యపై కిడ్నాప్ యత్నం కేసు నమోదు అయింది. తన కార్యాలయంలో ఉన్న కోటంరెడ్డి ఫొటో తొలిగించటంతో కోటంరెడ్డి తన ఇంటికి వచ్చి బెదిరించారని విజయ్ భాస్కర్ రెడ్డి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. కార్పోరేటర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.