ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యేలను హత్య చేసిన మావోయిస్టులు వీళ్లే...ఆమె కండక్టర్?:పోలీసులు వెల్లడి
విశాఖపట్టణం:అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు,మాజీ ఎమ్మెల్యే సివేరి సోమ హంతకులైన మావోయిస్టుల కోసం పోలీసుల వేట మొదలైంది. ఇప్పటికే వీరిని హతమార్చిన మావోయిస్టులలో ముగ్గురిని పోలీసులు గుర్తించి వారి ఫోటోలను విడుదల చేశారు.
ప్రత్యక్ష సాక్షుల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా పోలీసులు ఈ హత్యాకాండలో పాల్గొన్న మావోలను గుర్తించినట్లు తెలిసింది. వీరిని జనుమూరి శ్రీనుబాబు అలియాస్ సునీల్, మహిళా మావోయిస్టు కామేశ్వరి అలియాస్ స్వరూప, మరో మహిళా మావోయిస్టు వెంకట రవిచైతన్య అలియాస్ అరుణగా పోలీసులు గుర్తించారు.వీరి స్వస్థలాలు తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలని పోలీసులు తెలిపారు.
వీరిలో మహిళా మావోయిస్టు అరుణది విశాఖ జిల్లా పెందుర్తి మండలం కరకవానిపాలెం కాగా...మరో మహిళా మావోయిస్టు స్వరూపది పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పట్టణం...మూడో వ్యక్తి జలమూరి శ్రీనుబాబు తూర్పుగోదావరి జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. ఎమ్మెల్యేల కాల్చివేతకు పాల్పడిన అందరు మావోయిస్టులను గుర్తించడం సాధ్యం కాకున్నా ప్రధానంగా ఈ దాడిలో పాల్గొన్న ముగ్గురు మావోయిస్టుల వివరాలు తెలియడంతో పోలీసులు వేట ప్రారంభించారు.
ప్రత్యేక బలగాలతో పాటు విశాఖ జిల్లా పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తున్నట్లు విశాఖ జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ వెల్లడించారు. అయితే ఈ దాడిలో సాయుధులైన మహిళా మావోయిస్టులే ఎక్కువగా పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతుండటంపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం సుమారు 60 మంది మావోయిస్టులు ఈ దాడిలో పాల్గొనగా అందులో 30కి పైగా మహిళలు ఉన్నట్లుగా చెబుతున్నారు.
పైగా వీరంతా దాడికి ఒక రోజు ముందుగానే లివిటిపుట్టు గ్రామం సమీపానికి చేరుకున్నట్లు పోలీసుల విచారణలో తేలిందట. ఇదిలావుంటే ఈ దాడి ఆర్కే సారధ్యంలో జరిగినట్లు తొలుత భావించగా విచారణ లోతుగా వెళ్లేకొద్దీ చలపతి పేరు తెరమీదకు వచ్చింది. అలాగే చలపతి భార్య అరుణ నేతృత్వంలో ఈ ఆపరేషన్ జరిగిందని...ఆమె కూడా స్వయంగా దాడిలో పాల్గొందని పోలీసులు గుర్తించారంటున్నారు.
ఇదిలావుంటే ఎమ్మెల్యే,మాజీ ఎమ్మెల్యే హత్యకు పాల్పడిన వారిలో గోదావరి జిల్లాలకు చెందిన మావోయిస్టులు ఉన్నారని తెలియడంతో ఈ రెండు జిల్లాల వాసులు ఉలిక్కిపడ్డారు. సహజంగా సౌమ్యులుగా పేరొందిన గోదావరి వాసులే ఈ దాడిలో కీలక పాత్ర పోషించినట్లు తెలిసి పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. దీనికి తోడు కిడారి హత్యలో పాల్గొన్న మహిళా మావోయిస్టు పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వాసి అని తెలిసి స్థానికులు దిగ్భ్రాంతి చెందారు.
పైగా ఈమె గతంలో భీమవరం ఆర్టీసీ డిపోలో కండక్టర్ గా పని చేసిన కృష్ణవేణి అనే యువతిగా పోలీసుల అనుమానిస్తున్నారు. దీంతో హుటాహుటిన భీమవరం వెళ్లిన పోలీసులు ఆమె పనిచేసిన డిపోలో తనిఖీలు చేయడం తో పాటు ఆమెకి సంబంధించిన వివరాలు అమూలాగ్రం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అక్కడి సిబ్బంది నుంచి సమగ్ర సమాచారం రాబడుతున్నారు. ఈ విషయమై డిపో మేనేజర్ ను ప్రశ్నించగా 2013 నుంచి కృష్ణవేణి విధులకు రావడం లేదని చెప్పారట. ఆమె ఫోటో, ఇతర వివరాల కోసం పోలీసులు విచారణ సాగిస్తున్నారు.