మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, వైఎస్ కుటుంబం ఎదురెదురు!
అమరావతి: మరో 24 గంటలు! రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. విభజన తరువాత ఏర్పాటైన రాష్ట్రానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. గురువారం మధ్యాహ్నం 12:23 నిమిషాలకు వైఎస్ ప్రమాణ స్వీకారం చేస్తారు. ప్రస్తుతానికి ఆయన ఒక్కరే ప్రమాణ స్వీకారం చేస్తారని తెలుస్తోంది. కొద్దిరోజుల తరువాత మంత్రివర్గాన్ని ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించిన కసరత్తు సాగుతోంది.
వైఎస్ జగన్ ప్రమాణ స్వీకార కార్యక్రమాలు విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చురుగ్గా సాగుతున్నాయి. కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ సహా కృష్ణాజిల్లా నుంచి ఎన్నికైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాసన సభ్యులు, ఇతర సీనియర్ నాయకులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు. దాదాపుగా ప్రమాణ స్వీకార వేదిక ఏర్పాటు పనులు పూర్తి కావచ్చాయి. దీనికి సంబంధించిన ఓ మ్యాప్ను పోలీసులు విడుదల చేశారు.
వేదికపై ఏడుమందే..!
వేదికపై ఏడుమందికి మాత్రమే అవకాశం కల్పించారు. వేదిక ఎడమ వైపునకు గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కూర్చుంటారు. కుడివైపున వైఎస్ జగన్ ఆసీనులవుతారు. ఎడమ వైపునే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉంటారు. వేదిక వెనుక భాగంలో గవర్నర్ కార్యదర్శి, సాధారణ పరిపాలన శాఖ (ప్రొటోకాల్) ముఖ్య కార్యదర్శి, డైరెక్టర్ జనరల్, అదనపు డీజీపీ ఉంటారు. ప్రమాణ స్వీకార వేదికపై మొత్తంగా ఏడుమందికి మాత్రమే చోటు కల్పించారు.
వైసీపీ చెక్..సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్గా మారుతున్న జగన్
గవర్నర్, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులకు వేదిక దిగువన కుడి వైపున కూర్చుంటారు. గవర్నర్ భార్య విమలా నరసింహన్, వైఎస్ జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిళ, ఇతర కుటుంబ సభ్యులు కుర్చుంటారు. ఎడమ వైపున రాజకీయ ప్రముఖులకు స్థానం కల్పించారు.
స్పీకర్, మాజీ ముఖ్యమంత్రి, లోక్సభ సభ్యులు, శాసన సభ్యులు, శాసన మండలి సభ్యులు వేదిక ఎడమ వైపున కూర్చుంటారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ కార్యక్రమానికి హాజరవుతారా? లేదా? అనేది ఇంకా తేలాల్సి ఉంది. ఆయన హాజరైతే.. వైఎస్ కుటుంబ సభ్యులను ఎదురు పడటం ఖాయంగా కనిపిస్తోంది. వేదిక ముందు భాగంలో కుడి వైపున మీడియా పాయింట్ను ఏర్పాటు చేశారు.
వేదిక ముందు వరుసలో వివిధ రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు, ప్రత్యేక ఆహ్వానితులు కూర్చుంటారు. వారి వెనుక భాగంలో అధికారులు, వారి కుటంబ సభ్యులకు చోటు కల్పించారు. అనంతరం చివరి వరుసలో సాధారణ ప్రజలకు స్థానం కల్పించారు. పాసులు ఉన్న వారికి మాత్రమే లోనికి ప్రవేశించే అనుమతి ఉంది.