ఏడుగురు ఇంజనీర్లను కాపాడిన పోలీసులు:స్నానానికని దిగితే...ప్రాణాలకే ముప్పు వచ్చింది
తూర్పుగోదావరి:నదిలో స్నానం చేద్దామని సరదా పడితే ఆ ఉబలాటం ప్రాణాల మీదకు తెచ్చిన ఉదంతమిది. అయితే పోలీసులు సకాలంలో స్పందించి కాపాడాటంతో ప్రాణాలు దక్కించుకుని బతుకు జీవుడా అంటూ అక్కడ నుంచి బయట పడ్డారు. అసలేం జరిగిందంటే?
మోతుగూడెంలోని ఏపి జెన్కో లో అప్రెంటీస్ గా చేస్తున్న ట్రైనీ ఇంజనీర్లు సీలేరు నదిలో స్నానానికి దిగారు. అయితే ఉన్నట్టుండి సీలేరు నది ప్రవాహం ఒక్కసారిగా ఉధృతమైంది. దీంతో ఈ ఇంజనీర్లు నది ప్రవాహం మధ్యలో చిక్కుకున్నారు. నీటి ప్రవాహం దిగువకు తోసేస్తుండటంతో అప్పటిదాకా సరదాగా కేరింతలు కొట్టిన ఆ యువ ఇంజనీర్లు ప్రాణ భయంతో కేకలు వేశారు.
అయితే నది మధ్యలో ఒక గుట్ట మీదకు చేరి సహాయం కోసం అరవడం చేశారు. దీంతో వీరిని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వెంటనే స్పందించి సకాలంలో ఘటనా స్థలానికి చేరుకొని రక్షణ చర్యలు చేపట్టారు. వారిని ఒక్కొక్కరిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పోలీసులు వెంటనే స్పందించడంతో ప్రాణాలు దక్కాయని, లేకుంటే చనిపోవడం ఖాయమని ఇంజనీర్లు కృతజ్ఞతలు తెలిపారు.