మాజీ మంత్రి మాణిక్యాలరావును ఎత్తుకెళ్లి ఇంట్లో పడేసిన పోలీసులు...ఎంపి జివిఎల్ వార్నింగ్!
పశ్చిమగోదావరి:మాజీ మంత్రి, బీజేపీ తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే మాణిక్యాలరావు నివాసం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఎమ్మెల్యే-టిడిపి నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ల నేపథ్యంలో ఎమ్మెల్యే మాణిక్యాలరావుని గృహ నిర్బంధం చేశారు.
అయితే పోలీసుల ఆంక్షలు అధిగమించి వచ్చి రోడ్డుపై ఆందోళన నిర్వహించేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే మాణిక్యాలరావును పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లి ఇంట్లో పడేయడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసుల చర్యల నేపథ్యంలో మాణిక్యాల రావు అస్వస్థతకు గురవడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా తయారైంది. మరోవైపు తమ పార్టీ ఎమ్మెల్యే పట్ల పోలీసులు వ్యవహరించిన తీరుపై బిజెపి ఎంపి జివిఎల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
టిడిపి కి చెందిన స్థానిక జెడ్పీ చైర్మన్, మున్సిపల్ చైర్మన్లు ఉచిత ఇసుక రాష్ట్రాన్ని దోచుకు తింటున్నారని మాణిక్యాలరావు ఆరోపణాస్త్రాలు సంధించిన నేపథ్యంలో అవినీతిపై బహిరంగ చర్చకు సిద్దమా అంటూ టిడిపి నేతలు సవాలు విసిరారు. తాను చర్చకు సిద్దమేనంటూ బిజెపి ఎమ్మెల్యే మాణిక్యాలరావు ప్రతిస్పందించిన నేపథ్యంలో శాంతిభద్రతలకు భంగం వాటిల్లవచ్చంటూ పోలీసులు మాణిక్యాలరావును గృహనిర్భంధం చేశారు.
అయితే మాణిక్యాలరావు పోలీసుల తీరుపై నిరసన చేపట్టేందుకు ఉపక్రమించిన క్రమంలో పోలీసులకు బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ సందర్భంగా బిజెపి కార్యకర్తలు అభివృద్ధికి ఆటంకం, మట్టి మాఫియా బాపిరాజు డౌన్ డౌన్, పోలీసుల దౌర్జన్యం నశించాలంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతో రోడ్డుపై బైఠాయింపు జరుపుతున్న మాణిక్యాల రావును పోలీసులు బలవంతంగా ఎత్తుకెళ్లి ఇంట్లో ఎత్తి కుదేసినట్లు బిజెపి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. పోలీసుల చర్యల కారణంగా ఆయన అస్వస్థతకు గురైనట్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు మాణిక్యాలరావు పట్ల పోలీసులు వ్యవహరించిన తీరును బిజెపి ఎంపి జివీఎల్ నరసింహరావు తప్పుబట్టారు. సీఎం చంద్రబాబు నియంతలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. టిడిపి ప్రభుత్వం త్వరలోనే ప్రతిపక్షంలోకి వస్తుందన్న సంగతి గుర్తుపెట్టుకోవాలని హెచ్చరించారు. పోలీసులు టీడీపీకి తొత్తులుగా వ్యవహరించొద్దని, రాష్ట్రంలో శాంతిభద్రతలు లేవని తాము ఎప్పటి నుంచో చెబుతూనే ఉన్నామని జీవీఎల్ నరసింహరావు విమర్శించారు.