ఏపీ సెక్రటేరియట్ వద్ద కలకలం- నెల్లూరు కుటుంబం ఆత్మహత్యాయత్నం-కారణమిదే
గుంటూరు జిల్లా వెలగపూడిలోని ఏపీ సచివాలయం వద్ద ఇవాళ ఓ అనూహ్య ఘటన చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లాకు చెందిన దంపతులు పిల్లలతో సహా సచివాలయానికి వచ్చి అక్కడే ఆత్మహత్యాయత్నం చేశారు. దీంతో పోలీసులు వెంటనే స్పందించి వారిని కాపాడటంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
నెల్లూరు జిల్లా దుత్తలూరుకు చెందిన దంపతులు తమ ఇద్దరు పిల్లలతో సహా కారులో ఏపీ సచివాలయానికి వచ్చారు. కారు పార్కింగ్ చేస్తున్నట్లు అంతా భావించారు. కానీ ఒక్కసారిగా కారు బయటికి వచ్చి మీద పెట్రోల్ పోసుకున్నారు. వారితో పాటు ఇద్దరు పిల్లలు కూడా ఉండటంతో కాసేపు అక్కడ ఏం జరుగుతుందో ఎవరికీ అర్ధం కాలేదు. చివరికి పోలీసులు వెంటనే పరుగులు తీశారు. సకాలంలో వారిని వారించి అక్కడి నుంచి పంపేశారు.
ఏపీ సచివాలయం వద్ద నెల్లూరు దంపతుల ఆత్మహత్యా యత్నానికి అసలు కారణాన్ని పోలీసులు గుర్తించారు. జిల్లాలోని దుత్తలూరు ఎమ్మార్వో చంద్రశేఖర్ వీరిని మోసం చేసినట్లు పోలీసులు గుర్తించారు. తమ పొలాన్ని ఆన్లైన్ చేస్తానని చెప్పి డబ్బులు తీసుకుని మోసం చేసినట్లు వీరు ఆరోపిస్తున్నారు.
ఆత్మహత్యా యత్నానికి వచ్చిన వ్యక్తి పేరు అరిగెల నాగార్జునగా పోలీసులు నిర్ధారించారు. అతనికి చెందిన 33 ఎకరాల పొలాన్ని ఆన్లైన్లో నమోదు చేస్తానని ఎమ్మార్వో చంద్రశేఖర్ మోసం చేసినట్లు తేల్చిన పోలీసులు.. సమస్య పరిష్కారం కోసం తిరిగి ఎమ్మార్వో కార్యాలయానికి పంపినట్లు తెలుస్తోంది.