జగన్, చంద్రబాబుల ఇళ్ళ వద్ద పోలీసు భద్రత పెంపు... అదనంగా రెండు కంపెనీల ఫోర్స్ పహారా
మరికొన్ని గంటల్లో ఎన్నికల ఫలితాలు రానున్నాయి. ఏపీలో ప్రధాన పార్టీల్లో టెన్షన్ పీక్స్ కి చేరింది . ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు, లోక్ సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు రేపు ఉదయం ప్రారంభం కానుండగా, గుంటూరు జిల్లా తాడేపల్లి మండలంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నివాసం వద్ద, అలాగే పార్టీ కార్యాలయం వద్ద , ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం వద్ద పోలీసు భద్రతను పెంచారు. ఎన్నికల ఫలితాల నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యలో భాగంగా భద్రతను కట్టుదిట్టం చేశారు.
ఇక సీఎం చంద్రబాబు నివాసం వద్ద కూడా అదనపు భద్రతను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఏపీఎస్పీ (ఆంధ్రప్రదేశ్ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్)కు చెందిన రెండేసి కంపెనీలు పహారాలో ఉంటాయని పేర్కొన్నారు . ఎంపీలుగా, ఎమ్మెల్యేలుగా గెలుపొందిన అభ్యర్థులు, ఆ వెంటనే తమ పార్టీ అధినేతల ఇళ్లకు లేదా కార్యాలయాలకు చేరుకునే అవకాశం ఉన్నందున ముందుజాగ్రత్త చర్యగా భద్రతను పెంచినట్టు పోలీసు వర్గాలు వెల్లడించాయి.
కౌంట్డౌన్ స్టార్ : అమరావతిలో అగ్రనేతలు : జగన్తో పాటు పీకే.. వారి పైనే స్పెషల్ ఫోకస్..!
ఇక గుంటూరు అర్బన్ పోలీసులు అవసరాన్ని బట్టి సహకరిస్తారని, స్థానిక పోలీసులు షిఫ్ట్ కు 50 మంది చొప్పున అదనంగా భద్రత విధుల్లో ఉంటారని వెల్లడించారు. ఇక చంద్రబాబు, జగన్ నివాసాల వద్ద ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలను కూడా ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
ఫలితాల నేపధ్యంలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోనున్నారు . కృష్ణా నది పరీవాహక ప్రాంతంలో బాంబ్ స్క్వాడ్ లతో తనిఖీలు చెయ్యనున్నారు. ఎక్కడికక్కడ సీసీ టీవీ ఫుటేజ్ లను, గగన తల డ్రోన్ కెమెరాల ద్వారా పరిస్థితులను పర్యవేక్షించనున్నారు. అవసరం అయితే ట్రాఫిక్ మళ్ళింపులు కూడా చెయ్యనున్నారు.