జాతీయ రహదారుల దిగ్బంధం: నేతల హౌస్ అరెస్ట్ లు: కాసేపట్లో లోకేశ్ సైతం..!
మూడు రాజధానులు..అమరావతి నుండి పరిపాలనా రాజధాని తరలింపు ప్రతిపాదనలకు వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు అమరావతి పరిధిలోని గ్రామాలకే పరిమితమైన ఆందోళన లను..ఇప్పుడు జాతీయ రహదారుల మీద చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఈ రోజు జాతీయ రహదారుల దిగ్బంధనం కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
రాజధాని పరిధిలోని చిన కాకాని..అదే విధంగా చిలకలూరి పేట వద్ద జాతీయ రహదారులను దిగ్బంధించాలని నేతలు సూచించారు. అయితే, ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో..ఈ ఉదయం నుండే టీడీపీతో పాటుగా జేఏసీ నేతల ను పోలీసులు హౌస్ అరెస్ట్ లు చేస్తున్నారు.పలువురు మాజీ మంత్రులను సైతం ఇందులో ఉన్నారు. కాసేపట్లో మాజీ మంత్రి లోకేశ్ జాతీయ రహదారి మీదకు రానున్నారు..
జాతీయ రహదారుల మీదకు..అనుమతి నిరాకరణ
జాతీయ రహదారి దిగ్బంధనం కార్యక్రమానికి అమరావతి జేఏసీ పిలుపునిచ్చింది. సోమవారం రాజధాని గ్రామాలైన తుళ్లూరు నుండి మందడం వరకు రైతులు..స్థానికులు భారీ ర్యాలీ నిర్వహించారు. అమరావతి నుండి రాజధానిని తరలించవద్దని డిమాండ్ చేసారు. ఇక, ఇదే రోజు రాజధాని అంశం పైన ఏర్పాటైన హైపవర్ కమిటీ సమావేశం అవుతోంది. దీంతో..ఇప్పటి వరకు రాజధాని గ్రామాలకు పరిమితమైన ఆందోళన లను జాతీయ రహదారికి మార్చాలని భావించారు.
అయితే, ఈ కార్యక్రమానికి పోలీసులు అనుమతి నిరాకరించారు. ప్రజాజీవనానికి ఎదురయ్యే ఇబ్బందుల దృష్ట్యా రాస్తారోకోకు అనుమతి ఇవ్వలేదని పోలీసు ఉన్నతాధికారులు స్పష్టం చేసారు. శాంతి భద్రతల పరిరక్షణ దృష్ట్యా భద్రతా చర్యల్లో భాగంగా 30 పోలీస్ యాక్ట్, 144వ సెక్షన్ ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉంటాయన్నారు. అనుమతిలేని ఈ రాస్తారోకోలో ప్రజలు పాల్గొనరాదన్నారు. చట్ట బద్ద ఉత్తర్వు లు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.
కొనసాగుతున్న హౌస్ అరెస్ట్ లు...
జాతీయ రహదారి కార్యక్రమానికి అనుమతులు లేవని స్పష్టం చేసిన పోలీసులు..ముందస్తు చర్యలు ప్రారంభించారు. ఈ ఉదయం నుండే జేఏసీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. టీడీపీ...వామపక్ష నేతలను బయటకు రాకుండా అడ్డుకుంటున్నారు. మంగళగిరి..గుంటూరు నుండి నేతలు..పార్టీల కార్యకర్తలు బయటకు రాకుండా బందోబస్తు ఏర్పాటు చేసారు. మంగళగిరి ప్రాంతంలో దాదాపు మంది ముఖ్యమైన టీడీపీ కార్యకర్తలను హౌస్ అరెస్ట్ చేసారు.
ఇక, మాజీ మంత్రి నక్కా ఆనందబాబు..మాజీ ఎమ్మెల్యేలను పోలీసులు వారి ఇళ్ల నుండి బయటకు రాకుండా అడ్డుకున్నారు. అదే విధంగా పెనుమలూరు వద్ద కూడా పోలీసు లు భారీగా మోహరించారు. చినకాకాని..చిలకలూరి పేట వద్ద ఎక్కడా జాతీయ రహదారిపైన రాకపోకలకు ఇబ్బంది లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇక, మరి కాసేపట్లో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ మంగళగిరి..చినకాకాని వద్ద పార్టీ కార్యకర్తలతో కలిసి జాతీయ రహదారి దిగ్బంధనంలో పాల్గొనాలని నిర్ణయించారు. దీంతో..ఇప్పుడు పోలీసులు లోకేశ్ ను సైతం హౌస్ అరెస్ట్ చేస్తారా..లేక చినకాకాని వద్దకు వచ్చిన తరువాత అడ్డగిస్తారా అనేది చూడాల్సి ఉంది.