విజయవాడ: దుర్గగుడిలో పోలీసుల ఓవరాక్షన్...ఛైర్మన్ నే నిలిపివేశారు;మనస్థాపంతో తిరుగుముఖం
విజయవాడ:దుర్గగుడిపై పోలీసుల ఓవరాక్షన్ ఆ శాఖను విమర్శల పాలు చేసింది. అమ్మవారి దర్శనం కోసం కుటుంబంతో సహా వచ్చిన దుర్గ గుడి చైర్మన్ గౌరంగబాబునే పోలీసులు అడ్డుకొని నిలిపివేశారు.
అరగంట వేచిచూసినా పోలీసులు పంపించకపోవడంతో మనస్థాపం చెందిన ఆయన కుటుంబంతో సహా వెనుతిరిగి వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసిన కలెక్టర్, సీపీ, దుర్గగుడి ఈవో గౌరంగబాబును కలిసి జరిగిన ఘటనకు చింతిస్తున్నట్లు తెలిపారని సమాచారం. దుర్గగుడి పాలకమండలి సభ్యులంటే తమకు గౌరవం ఉందని, మిమ్మల్ని అడ్డుకున్న పోలీసు అధికారిని విధుల నుంచి తొలగించామని ఛైర్మన్ గౌరంగబాబుతో చెప్పినట్లు తెలిసింది.
అలా జరిగిన మాట...వాస్తవం
దుర్గ గుడిలో తనకు అవమానం జరిగినట్లుగా వెలువడిన వార్తలు వాస్తవమేనని ఛైర్మన్ గౌరంగబాబు చెప్పారు. పోలీసులు తనను నిలిపివేసింది నిజమేనన్నారు. తొలుత ఒక గేటు వద్ద పోలీసులు తనను అడ్డుకున్నారని, అక్కడ అరగంట వేచిచూశాక ఆలయ అధికారుల జోక్యంతో అక్కడినుంచి లోపలికి అనుమతించారని, అయితే కొండపైన ఉన్న తన కార్యాలయానికి వెళ్తుండగా మరోసారి పోలీసులు తనను నిలిపివేశారని గౌరంగ బాబు మీడియాకు వెల్లడించారు.
గౌరంగబాబుకు...సారి చెప్పిన సిపి
పోలీసులతో గొడవ పెట్టుకోవాలంటే ఎంతోసేపు పట్టదని గౌరంగబాబు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన విషయంపై సీపీ ద్వారకాతిరుమలరావు తనతో మాట్లాడారని...తనను అడ్డుకున్న అధికారిపై చర్యలు తీసుకుంటామని చెప్పారని గౌరంగబాబు తెలిపారు. మరోవైపు జరిగిన ఘటనకు చింతిస్తున్నామని, మరోసారి పునరావృతం కాకుండా చూస్తామని సీపీ ద్వారకాతిరుమలరావు కూడా మీడియాతో అన్నారు.
అనుచరుల...అనుమానం
అయితే ఛైర్మన్ అడ్డుకోవడంపై ఆయన మద్దతుదారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా ఆలయ ఈవో కోటేశ్వరమ్మకు పాలకమండలికి మధ్య వివాదం కొనసాగుతున్న విషయాన్ని వారు గుర్తుచేస్తున్నారు. మూలా నక్షత్రం సందర్భంగా ఆలయం పూర్తిగా పోలీసులు ఆధీనంలో ఉందని...ఈ నేపధ్యంలోనే ఛైర్మన్ ను పోలీసులు రెండు సార్లు అడ్డుకోవడంపై సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇదేమిటని పోలీసులను ప్రశ్నిస్తే తమకున్న ఆదేశాల మేరకే నడుచుకుంటున్నామని వారు సమాధానం ఇస్తున్నారని తెలిపారు.
సిఎం పట్టువస్త్రాల...సమర్పణ
ఇదిలావుండగా ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పట్టు వస్త్రాలు సమర్పించారు. ప్రస్తుతం ఇంద్రకీలాద్రిపై దేవీ నవరాత్రులు వైభవంగా జరుగుతున్నారు. ఆదివారం సరస్వతీ దేవి అలంకారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. కాగా... ఆదివారం మధ్యాహ్నం 2గంటలకు సీఎం చంద్రబాబునాయుడు అమ్మవారిని దర్శించుకుని పట్టువస్త్రాలు సమర్పించారు. దీంతో ముఖ్యమంత్రి రాకను పురష్కరించుకుని క్యూ లైన్లలో తొక్కిసలాట జరగకుండా పోలీసుల ముందస్తు చర్యలు తీసుకున్నారు.