తలపై నరికి.. బ్యాండేజీ కట్టారు: హత్యకు ముందు హింసించిన ఆనవాళ్లు: రిమాండ్ రిపోర్ట్ లో సంచలన విషయాలు
కడప: రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించిన మాజీ మంత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వైఎస్ వివేకానంద రెడ్డి హత్యోదంతంలో కొత్త విషయాలు వెలుగు చూస్తున్నాయి. వివేకా హత్యోదంతంపై దర్యాప్తు చేస్తోన్న సిట్ పోలీసులు కొన్ని దిగ్భ్రాంతికర అంశాలను గుర్తించారు. కొన్ని విషయాలు పోలీసులకు సైతం నివ్వెరపరిచేలా ఉన్నాయని తెలుస్తోంది. వివేకాను హతమార్చిన తీరు.. అత్యంత అమానవీయమని అభిప్రాయపడుతున్నారు. తాము గుర్తించిన విషయాలను రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచినట్లు సమాచారం.
చిత్రహింసలకు గురి చేశారా?
వివేకాను హతమార్చడానికి ముందు హంతకులు, ఆయనను చిత్రహింసలకు గురి చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆయన శరీరంపై ఏడు చోట్ల ఉన్న గాయాల గుర్తు.. వాటిని సూచిస్తున్నాయని అంచనా వేస్తున్నారు. పదునైన ఆయుధంతో శరీరాన్ని ఏడు చోట్ల కోసి ఉంటారని అనుమానిస్తున్నారు. ఆయా గాయాల లోతు సుమారు నాలుగు అంగుళాలకు పైనే ఉన్నట్లు సమాచారం. అలాంటి గాయాలు వివేకా మృతదేహంపై ఏడుచోట్ల కనిపించాయి. తలపైనా సరిగ్గా తల మధ్య భాగంలో నరికిన ఆనవాళ్లు ఉన్నట్లు.. ఇదివరకే సామాజిక మాధ్యమాల్లో విడుదలై ఫొటోల్లో కనిపించాయి. నరికిన గుర్తు కనిపించకుండా ఉండటానికి నిందితులు.. తలకు కట్టుకూడా కట్టారని, దీనికి సంబంధించిన గుర్తులు ఉన్నాయని చెబుతున్నారు.
ఆ ముగ్గురే సూత్రధారులా? హంతకులెవరో వారికి తెలుసా?
వివేకాను హత్య చేసినదెవరో ముగ్గురు వ్యక్తులకు తెలుసని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎర్ర గంగిరెడ్డి, ఎం వెంకట కృష్ణారెడ్డి, ప్రకాశ్ రెడ్డిలకు సమాచారం ఉందని అంటున్నారు. హత్య చేసిన వారికి సంబంధించిన సాక్ష్యాలు దొరక్కుండా వారు సంఘటనాస్థలాన్ని శుభ్రం చేసి ఉంటారని అంచనా వేస్తున్నారు. సాక్ష్యాధారాలను తుడి చేసే ప్రయత్నం చేయడం ఇందులో భాగమేనని అభిప్రాయపడుతున్నారు. వివేకా వినియోగించే బెడ్ రూమ్, బాత్ రూమ్ లో రక్తపు మరకలను శుభ్రం చేయడానికి వాడినట్లుగా అనుమానిస్తున్న ఓ ప్లాస్టిక్ బకెట్, తడిగుడ్డతో పాటు సంఘటనా స్థలంలో లభించిన వెంట్రుకలు, బొట్టు స్టిక్కర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివేకాకు చెందిన రెండు సెల్ఫోన్లు, ఓ లేఖ, ఇతర వస్తువులను పోలీసులు వ్యక్తిగత సహాయ కార్యదర్శి వెంకట కృష్ణారెడ్డి నుంచి స్వాధీనం చేసుకున్నారు.
వివేకా హత్యకేసులో అనుమానితులుగా పోలీసులు ఎర్ర గంగిరెడ్డి, వెంకట కృష్ణారెడ్డి, ప్రకాశ్ రెడ్డిలను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఈ ముగ్గురిలో గంగిరెడ్డి.. వైఎస్ వివేకానందరెడ్డికి కుడిభుజం లాంటి వారని చెబుతున్నారు. వెంకట కృష్ణారెడ్డి.. వివేకా వ్యక్తిగత సహాయకుడు. మరో నిందితుడు ప్రకాశ్ వంటమనిషి కుమారుడని తేలింది. పులివెందుల ఫస్ట్క్లాస్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ న్యాయస్థానంలో రిమాండ్ రిపోర్ట్ ను అందజేశారు.
ఆ రోజు ఏం జరిగిందంటే..పాయింట్ టు పాయింట్ రిమాండ్ రిపోర్ట్ లో..
ఈ నెల 15వ తేదీన వైఎస్ వివేకానంద రెడ్డి పులివెందులలోని తన స్వగృహంలో హత్యకు గురైన విషయం తెలిసిందే. అదే రోజు తెల్లవారు జామున 5:30 గంటల సమయంలో వివేకా వ్యక్తిగత సహాయకుడు వెంకట కృష్ణారెడ్డి ఆయన ఇంటికెళ్లారు. కాలింగ్ బెల్ కొట్టినప్పటికీ.. వివేకా తలుపు తీయకపోవడంతో కృష్ణారెడ్డి అక్కడే బయట కూర్చొని అరగంట పాటు దినపత్రికలు చదువుకున్నారు. అప్పటికీ వివేకా తలుపు తీయకపోవడంతో ఆయన హైదరాబాద్ లో నివసిస్తున్న ఆయన భార్య సౌభాగ్యమ్మకు ఫోన్ చేశారు. వివేకా ఇంకా నిద్ర లేవలేదని, ఫోన్ చేసి లేపాలని వెంకట కృష్ణా రెడ్డి ఆమెను కోరారు. ఎన్నికల ప్రచారంలో అలసిపోయి ఉంటారని, అప్పుడే లేపొద్దని సౌభాగ్యమ్య ఆయనకు సూచించారు.
సుమారు 7 గంటల సమయంలో వంటమనిషి లక్ష్మి, ఆమె కుమారుడు ప్రకాశ్లు వివేకా ఇంటివద్దకు చేరుకున్నారు. కృష్ణారెడ్డి సూచన మేరకు వారిద్దరూ వివేకాను నిద్రలేపేందుకు పలుమార్లు పిలవగా స్పందన లేదు. ఇంటి పక్క డోరు తెరుచుకుని ఉందని వాచ్మెన్ రంగన్న చెప్పటంతో వెంకట కృష్ణారెడ్డి, ప్రకాశ్ కలిసి ఇంట్లోకి వెళ్లారు. బెడ్ రూమ్ లో రక్తపు మరకలు కనిపించాయి. బాత్ రూమ్లో వివేకా రక్తపుమడుగులో పడి ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే అతను మృతిచెందినట్లు నిర్ధారించుకున్నారు. వెంటనే బయటికి వచ్చి ఈ విషయాన్ని వివేకా అల్లుడు రాజశేఖర్రెడ్డి, భార్య సౌభాగ్యమ్మకు ఫోన్ ద్వారా తెలిపారు. ఈ విషయాలన్నింటినీ పోలీసులు రిమాండ్ రిపోర్ట్ లో నమోదు చేశారు.
నిందితులకు బెయిల్ ఇవ్వొద్దు
ఈ కేసులో ప్రధాన నిందితుణ్ని గుర్తించేందుకు మరికొన్ని ఆధారాలు సేకరించాల్సి ఉందని పోలీసులు పులివెందుల న్యాయస్థానాన్ని కోరారు. వారికి బెయిల్ లభిస్తే.. సాక్ష్యాధారాలను ధ్వంసం చేస్తారని పేర్కొన్నారు. 15 రోజుల పాటు ముగ్గుర్ని పోలీసు కస్టడీకి ఇవ్వాలని రిమాండు రిపోర్టులో కోరారు.