ఏపీ 108 వాహనాల కాంట్రాక్టులో అవినీతి- సాయిరెడ్డి అల్లుడి పాత్ర ? టీడీపీ నేత కలకలం...
ఏపీలో 108 వాహనాల నిర్వహణ కాంట్రాక్టు వ్యవహారం వైసీపీ ప్రభుత్వానికి చుట్టుకునేలా కనిపిస్తోంది. కాంట్రాక్టు గడువు పూర్తి కాకముందే అరబిందో సంస్ధకు కాంట్రాక్టు అప్పగించడంపై టీడీపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తోంది. దీంతో ఈ వివాదంపై ప్రభుత్వం వివరణ ఇచ్చేలోపే ఆరోపణలు చేసిన టీడీపీ నేత పట్టాభి ఇంటిని విజయవాడ పోలీసులు చుట్టుముట్టడం కలకలం రేపుతోంది.
జగన్ సర్కారు మరో రికార్డు.. చంద్రబాబును సొంత ఎమ్మెల్యేలే ఛీకొట్టారన్న వైసీపీ విజయసాయి..
108 వాహనాల కాంట్రాక్టు...
ఉమ్మడి ఏపీలో 108 వాహనాల నిర్వహణ కాంట్రాక్టు దక్కించుకున్న జీవీకే సంస్ధ... 2016 తర్వాత మరో ఐదేళ్లకు దాన్ని పొడిగించుకుంది. ఈ గడువు పూర్తి కాకముందే వైసీపీ సర్కారు తాజాగా వాహనాల పెంపుతో పాటు కాంట్రాక్టును కూడా అరబిందో సంస్ధకు కట్టబెట్టింది. ఈ అరబిందో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డిది కావడంతోనే ప్రభుత్వం జీవీకే కాంటాక్టును వీరికి కట్టబెట్టిందని, ఇందులో రూ.307 కోట్ల అవినీతి జరిగిందంటూ విజయవాడకు చెందిన టీడీపీ నేత పట్టాభి ఆరోపణలు చేశారు. దీనిపై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో తీవ్ర కలకలం రేగింది.
కాంట్రాక్టుపై టీడీపీ ప్రశ్నలు...
ఎప్పటి నుంచో ఆరోగ్యశాఖ కమిషనర్ కింద ఉన్న 108 అంబులెన్స్ ల నిర్వహణ కాంట్రాక్టు వ్యవహారాన్ని ఆరోగ్యశ్రీ ట్రస్టు కిందకు ప్రభుత్వం బదిలీ చేయడం, కొత్తగా డిప్యూటీ సీఈవోను తీసుకురావడం, ఆ తర్వాత ఆఘమేఘాల మీద ఆయనకు ట్రస్టు డైరెక్టర్ పదోన్నతి కల్పించడాన్ని టీడీపీ ప్రశ్నిస్తోంది. డైరెక్టర్ పదోన్నతి తర్వాత అంబులెన్స్ ల నిర్వహణ కోసం రూ. 71.48 కోట్లు విడులయ్యాయి. ఏడాదికి జీవీకే పాత కాంట్రాక్టు ప్రకారం రూ.1.31 లక్షలు రూపాయలు తీసుకుంటుంటే, కొత్తగా అరబిందోకు రూ.2.21 లక్షల చొప్పున తీసుకునేలా కాంట్రాక్టు ఇవ్వడాన్ని టీడీపీ తప్పుబడుతోంది. అదే సమయంలో పాత కాంట్రాక్టు అమల్లో ఉన్నప్పటికీ అర్ధాంతరంగా రద్దు చేసి కొత్తవారికి అఫ్పగించడంలో పరమార్ధం ఏంటని ప్రశ్నిస్తోంది. దీనికి వైసీపీ ప్రభుత్వం వద్ద సమాధానం లేదు.
ప్రశ్నించిన నేతపై పోలీసు ఒత్తిళ్లు...
108 అంబులెన్స్ ల నిర్వహణలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డికి చెందిన అరవిందో సంస్ధకు భారీ ఎత్తున లబ్ది చేకూరుతుందని ఆరోపణలు చేసిన టీడీపీ నేత పట్టాభి ఇంటికి ఇవాళ పోలీసులు వెళ్లారు. ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మోహరించారు. దీనిపై టీడీపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. విజయసాయిరెడ్డి అల్లుడిపై ఆరోపణలు చేస్తే పోలీసులు ఆయన ఇంటికి వెళ్లి నిర్దారించుకోకుండా తన ఇంటికి రావడమేంటని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మాజీ మంత్రి దేవినేని ఉమ కూడా ఇదే విషయంపై ట్వీట్ చేశారు. ప్రభుత్వ అవినీతిని బయటపెట్టిన వారిపై పోలీసులతో ఒత్తిడి తీసుకురావడం సరికాదన్నారు.