స్నేహితుడితో కలిసి షికారుకెళితే.. పోలీసులమంటూ బెదిరించి యువతిపై గ్యాంగ్ రేప్...
అనంతపురం: స్నేహితుడితో కలిసి షికారుకెళ్లిన ఓ యువతిని పోలీసులమంటూ బెదిరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు దుండగులు. గురువారం ఆత్మకూరు పోలీసుస్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న ఈ ఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వివరాల్లోకి వెళితే... హిందూపురంకి చెందిన ఓ యువతి అనంతపురంలో ఉంటూ చదువుకుంటోంది. గురువారం తన చిన్ననాటి స్నేహితుడితో ఆత్మకూరు మండలం పంపనూరు దేవాలయానికి వెళ్లింది.
దారి మధ్యలో ఆగి వారు కబుర్లు చెప్పుకుంటుండగా ఇద్దరు యువకులు అక్కడికి వచ్చారు. 'ఏయ్.. ఇక్కడేం చేస్తున్నారు? వీడెవడు? పదండి పోలీస్స్టేషన్కు అంటూ వారిని బెదిరించారు. దీంతో ఆ యువతి, ఆమె స్నేహితుడు బెదిరిపోయారు.
ఇదే అదనుగా ఆ ఇద్దరు దుండగులు ఆ యువతిని తమ బైక్పై ఎక్కించుకుని ఆత్మకూరు వైపు బయలుదేరారు. కొంతదూరం వెళ్లిన తరువాత చెట్లపొదల్లోకి తీసుకెళ్లి అక్కడ ఆ యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
ఈ ఘటనపై బాధితులు గురువారం రాత్రి పోలీసులను ఆశ్రయించడంతో రంగంలోకి దిగిన పోలీసు ప్రత్యేక బృందం నిందితులను గుర్తించారు. ఆ ఇద్దరు దుండగులు గతంలో గొర్రెలు దొంగిలించిన వారు.
ఈ కేసులో తాజా ట్విస్ట్ ఏమిటంటే.. తనపై అత్యాచారం జరిగిందంటూ బాధిత యువతి లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడానికి నిరాకరించడం. దీంతో ఏం చేయాలంటూ పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు.
అత్యాచారం కేసు నమోదు చేయకపోయినా.. ఆ ఇద్దరు నిందితులపై మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలని వారు భావిస్తున్నారు. నిందితులపై రౌడీషీట్ కూడా ఓపెన్ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.