కిడ్నాప్ కథ సుఖాంతం: పేరంట్స్ వద్దకు పసికందు, అవనిగడ్డలో కిడ్నాపర్లు అరెస్ట్
అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనాన్ని సృష్టించిన విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పసికందు కిడ్నాప్ కథ సుఖాంతం అయింది. రెండు రోజుల క్రితం ఆసుపత్రిలోని ఇంక్యుబేటర్ నుంచి కిడ్నాప్కు గురైన పసికందు ఎట్టకేలకు శుక్రవారం రాత్రి తల్లిదండ్రుల వద్దకు చేరింది.
అసలేం జరిగింది, ఎవరా మహిళ?: బెజవాడ పసికందు కిడ్నాప్ కేసులో కొత్త ట్విస్ట్
ప్రస్తుతం బాబు క్షేమంగా ఉన్నాడు. చిల్డ్రన్స్ వార్డులో వైద్యులు చికిత్సను కొనసాగిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో సెక్యూరిటీ గార్డు హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన వ్యక్తులే పసికందును కిడ్నాప్ చేశారని ఆసుపత్రి సెక్యూరిటీ సిబ్బంది సమాచారం మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కిడ్నాపర్లు గంగు నాగమల్లేశ్వరి, రాజాలను అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద నుంచి పసికందును తల్లిదండ్రులకు అప్పగించారు. పసికందుని సుక్షితంగా తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు శుక్రవారం రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రకటించారు. ప్రస్తుతం కిడ్నాపర్లు రాజా, నాగమల్లేశ్వరిలను పోలీసులు విచారిస్తున్నారు. పసికందు కిడ్నాప్ ఘటనపై గత రెండు రోజులుగా మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే.
వివరాల్లోకి వెళితే... కొత్తపేటకు చందిన సుబ్రహ్మమ్యం, కళ్యాణి దంపతులు వారం రోజుల క్రితం జన్మించిన తమ కుమారుడికి కామెర్లు సోకడంతో విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని నవజాతు శిశు చికిత్సా కేంద్రంలో ఈనెల 13వ తేదీన ఇంక్యుబేటర్లో పెట్టారు.
చికిత్స పొందుతున్న శిశువును 14వ తేదీ ఉదయం ఎవరో ఎత్తుకుపోయారు. దీని పైన అక్కడి సిబ్బందిని అడిగితే నోరు మెదపడం లేదని బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని మహిళ చిన్నారని తీసుకు వెళ్లిందని కొందరు చెబుతున్నారు. ఆసుపత్రిలో సిసి కెమెరాలు కూడా లేకపోవడంతో ఎవరు తీసుకెళ్లారనే విషయం తెలియలేదు.
మరోవైపు ఈ కేసులో పోలీసులు విడుదల చేసిన అనుమానితుల చిత్రాలతో చిక్కుముడి వీడిపోతుందని భావించినప్పటికీ.. అది జరక్కపోగా.. కేసు మరింత సమస్యాత్మకంగా మారింది. 'మాయమైన బేబీతో మహిళ' అంటూ పోలీసులు ఓ ఫోటోతో కరపత్రాలను ముద్రించడంతో ఈ కేసు శుక్రవారానికి మరో మలుపు తిరిగింది.
దీంతో అసలు బిడ్డ ఏమయ్యాడు? ఇంతమంది జనాలు తిరిగే ప్రదేశంలో తమ శిశువుని ఎవరు ఎత్తుకెళ్లారో తెలియక తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. అంతేకాదు శుక్రవారానికి వారి ఆగ్రహం కట్టలు తెంచుకుని ఆసుపత్రి సిబ్బందిపైకి వెళ్లేందుకు ప్రయత్నించగా.. తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే.. తమ పరిస్థితి ఇలా మారిందని, బిడ్డ మాయం వెనుక వారి హస్తం ఉందంటూ.. శుక్రవారం రాత్రి వరకూ ఆసుపత్రి ఎదుట బైఠాయించి ఆందోళన నిర్వహించారు. చివరకు శుక్రవారం రాత్రికి పసికందు ఆచూకీ లభించడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు.