మాజీ మంత్రి భూమా అఖిల ప్రియ ఫోన్ల స్వాధీనం కోసం పోలీసుల యత్నం .. వాటిలో కీలక సమాచారం ?
తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో భూమా అఖిల ప్రియను దోషిగా తేల్చే ఆధారాలను సేకరిస్తున్నారు పోలీసులు . మాజీ మంత్రి భూమా అఖిలప్రియ , బోయినపల్లి సోదరుల కిడ్నాప్ కేసులో పీకల్లోతులో కూరుకుపోయారు. మూడు రోజులపాటు భూమా అఖిలప్రియ పోలీసులు 30 గంటల పాటు 300 ప్రశ్నలు వేసి అఖిల ప్రియ ను ఉక్కిరిబిక్కిరి చేశారు. పోలీసుల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక అఖిలప్రియ తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
టీడీపీ నేత భూమా అఖిలప్రియకు ఉచ్చు బిగుస్తున్నా .. బోయినపల్లి కిడ్నాప్ కేసుపై చంద్రబాబు సైలెంట్
కిడ్నాప్ కేసు నిందితులతో అఖిల ప్రియ ఫోన్ కాల్స్
అయితే అఖిల ప్రియను విచారించిన పోలీసులకు కొన్ని కీలక ఆధారాలు లభించినట్లు గా తెలుస్తుంది. బోయినపల్లి సోదరుల కిడ్నాప్ కు ముందు భూమా అఖిలప్రియ గుంటూరు శ్రీను తో మాట్లాడినట్లుగా ఆమె కాల్ రికార్డ్స్ ఆధారంగా గుర్తించారు పోలీసులు. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఉన్న అఖిల ప్రియ సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంటే మరింత కీలక సమాచారం రాబట్టే అవకాశముందని పోలీసులు భావిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకోవడం కోసం పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.
విజయవాడ నుండి కూకట్ పల్లి వరకు రెండు మొబైల్స్ లో మాట్లాడిన అఖిల ప్రియ
కిడ్నాప్ సమయములో, కిడ్నాప్ కు ముందు అఖిల ప్రియ నిందితులతో రోజు మాట్లాడినట్లుగా పోలీసులు గుర్తించారు. విజయవాడ నుండి కూకట్ పల్లి లోని లోధా అపార్ట్మెంట్ వరకూ ఆమె రెండు సెల్ నెంబర్లతో మాట్లాడినట్లుగా కాల్ డేటా ఆధారంగా గుర్తించారు పోలీసులు. అఖిల ప్రియ ను పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో ఆమె రెండు మొబైల్స్ ఇంట్లోనే ఉండి పోయినట్లుగా తెలుస్తుంది. ఇక వాటిని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తే అందులో ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారం దొరికే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు .
అఖిల ప్రియ ఇంట్లోనే ఉండ్పోయిన మొబైల్స్ .. కోర్టును అనుమతి కోరనున్న పోలీసులు
ప్రస్తుతం అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్, అఖిల ప్రియ సోదరుడు జగత్ విఖ్యాత్ రెడ్డి తో పాటు ఇతర కుటుంబ సభ్యుల ప్రమేయం కూడా ఉన్నట్టు గుర్తించి కేసు నమోదు చేసిన పోలీసులు వారి కోసం గాలిస్తున్నారు. భూమా అఖిలప్రియ అరెస్టు తర్వాత అఖిలప్రియ ఇంటికి తాళం వేసి ఉండటంతో ఆమె రెండు మొబైల్స్ ఆ ఇంటి లోపలే ఉండిపోయాయి. ఈ నేపథ్యంలో పోలీసులు కోర్టును ఆశ్రయించి కోర్టు అనుమతి తీసుకుని ఇంటి తాళం తీసి సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని అందులో ఉన్న డేటాను విశ్లేషించాలని తీవ్ర యత్నాలు చేస్తున్నారు. మరోవైపు భూమా అఖిలప్రియ పోలీస్ కస్టడీ తర్వాత మళ్లీ చంచల్గూడా సెంట్రల్ జైలుకు తరలించబడ్డారు.