'పోలీసుల్ని చంపేస్తే ఎవరు రాలేదే, తమిళనాడు అర్థం చేసుకోవాలి'
హైదరాబాద్: శేషాచలం కొండల్లో జరిగిన ఎన్కౌంటర్ పైన పోలీసు అధికారుల సంక్షేమ సంఘం మంగళవారం ఘాటుగా స్పందించింది. దొంగలకు మద్దతిస్తున్న వారే వారిని అడవులకు పంపించారా చెప్పాలని ప్రశ్నించారు. అదే ఎర్రచందనం దొంగలు అధికారులను చంపినప్పుడు ఎవరు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
ఎన్కౌంటర్ సమయంలో తాము కులం, ప్రాంతం, మతం చూడమన్నారు. దొంగల కుల, మతాలు తమకు ఎలా తెలుస్తాయని చెప్పారు. దొంగలకు మద్దతిస్తున్న వారే వారిని అడవులకు పంపించారా అని ప్రశ్నించారు. ఘటన జరిగీ జరగకముందే రాజకీయం శోచనీయమన్నారు. పార్టీల రాద్దాంతాన్ని ఖండిస్తున్నామన్నారు.
వైసీపీ, కాంగ్రెస్ పైన గాలి నిప్పులు
ఎన్కౌంటర్ను రాజకీయం చేస్తున్నారని వైయస్సార్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీల పైన టీడీపీ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు మండిపడ్డారు. పోలీసులు రూ.50వేల కోట్ల చందనం దుంగలను కాపాడారన్నారు. దీనిని తమిళనాడు ప్రభుత్వం అర్థం చేసుకోవాలని కోరారు.
పోలీసులు ప్రాణాలకు తెగించి వన సంపదను కాపాడారని చెప్పారు. రూ.50వేల కోట్ల వన సంపద అక్రమంగా రవాణా అవుతుంటే చూస్తూ పోలీసులు ఊరుకోవాలా అని ప్రశ్నించారు. ప్రాణాలకు తెగించి పోలీసులు పని చేస్తున్నారన్నారు.
ఎర్రచందనం అమ్మి ప్రజలకు ఖర్చు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు చూస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 3500 టన్నుల ఎర్ర చందనం అమ్మితే రూ.900 కోట్లు వచ్చాయన్నారు. ప్రభుత్వాన్ని, పోలీసులను కించపరిచేలా మాట్లాడొద్దన్నారు.
మన అడవుల్లోకి వస్తేనే పోలీసులు చర్యలు తీసుకున్నారని చెప్పారు. రాష్ట్రం కోసం పోలీసులు చేసిన కృషిని అభినందించాలన్నారు. అటవీ శాఖ అధికారులను దొంగలు చంపినప్పుడు వైసీపీ, కాంగ్రెస్ పార్టీలు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.