ఫ్రెండ్లీగా ఉంటూనే తప్పుచేస్తే సహించొద్దని పోలీసులకు సూచన..! ఒంగోలులో రేప్ ఘటనపై ఆరా తీసిని జగన్..
అమరావతి/హైదరాబాద్ : శాంతిభద్రతల మెరుగుదలకు మొదటి ప్రాధాన్యమిస్తామని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో అవినీతి లేని పాలన అందించడమే తమ లక్ష్యంగా చెప్పుకొచ్చారు. అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లోనే ఆ దిశగా అడుగులు వేస్తున్నామని, కలెక్టర్లు, ఎస్పీలే కాదు.. ప్రతి ఉద్యోగి ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకోవాలన్నారు. ప్రజావేదికలో జరిగిన ఐపీఎస్ అధికారుల సదస్సులో సీఎం జగన్ అధికారులనుద్దేశించి మాట్లాడారు.
ఏపీ పోలీస్ వ్యవస్థను నెంబర్వన్ చేయాలన్నది తమ లక్ష్యంగా పేర్కొన్నారు. పోలీసులు మానవీయ కోణంలో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. పోలీసు స్టేషన్లలో రిసెప్షన్ విభాగాన్ని ఏర్పాటు చేయాలన్నారు. సాయం కోసం వచ్చిన వారికి న్యాయం చేయాలన్నారు. దళితులు, బలహీనవర్గాల మన్ననలు పొందాలని సూచించారు. మహిళలకు రక్షణ కల్పించకపోతే పోలీసుల వ్యవస్థ విఫలమైనట్టేనని వ్యాఖ్యానించారు. ఈవ్టీజింగ్, సైబర్ క్రైమ్ను అరికట్టాలని కచ్చితమైన ఆదేశాలిచ్చారు. దేశంలోనే తొలిసారిగా పోలీసులకు వీక్లీ ఆఫ్ ఇచ్చామని సీఎం గుర్తుచేశారు.
Recommended Video
ప్రజలతో స్నేహ పూర్వకంగా ఉండాలి..! తప్పు చేస్తే లాఠీ ఝుళిపించాలని జగన్ పోలీసులకు సూచన..!!
గత ప్రభుత్వంలో పోలీసులు సైతం యథేచ్చగా ఉల్లంఘనలకు పాల్పడ్డారని ముఖ్యమంత్రి జగన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజకీయ ఒత్తిళ్లతో ఇసుక అక్రమ రవాణాలో పోలీసులు కూడా జోక్యం చేసుకునే దుస్థితి ఉండేదన్నారు. ఇసుక మాఫియాను పోలీసు వ్యవస్థ శాసించిందని వ్యాఖ్యానించారు. పర్సనల్ ఇగోలు పక్కన పెట్టాలని పోలీసు అధికారులకు సీఎం సూచించారు. ఇసుక మాఫియాను అడ్డుకున్న ఎమ్మార్వోపై దాడి చేసిన ఘటనను ఈ సందర్భంగా సీఎం గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో అక్రమ మైనింగ్ యథేచ్చగా జరిగిందని, క్లబ్బుల్లో యధేచ్చగా జూదం జరిగిందని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వంలో ఇలాంటి వాటికి చోటు లేదని సీఎం జగన్ తేల్చి చెప్పారు. తప్పు ఎవరు చేసినా సహించ వద్దని స్పష్టమైన ఆదేశాలిచ్చారు.
ఒంగోలు ఘటనపై విచారం..! వివరాలు తెలుసుకున్న ఏపి సీఎం..!!
ఒంగోలులో బాలికపై గ్యాంగ్ రేప్ ఘటనపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆరా తీశారు. జిల్లా ఎస్పీ ఈ ఘటనకు సంబంధించి వివరాలు సీఎంకు వెల్లడించారు. ఘటన జరిగిన 24 గంటల్లోగా నిందితులను పట్టుకున్నామని చెప్పారు. దీంతో జగన్ ఎస్పీకి అభినందనలు తెలిపారు. బాధితురాలికి పరిహారం ఇవ్వాలంటూ హోంమంత్రికి జగన్ ఆదేశాలు జారీ చేశారు. బాధితురాలికి రూ.5 లక్షలు పరిహారం ఇస్తామని హోంమంత్రి సుచరిత ప్రకటించారు.గుంటూరుకు చెందిన 16 ఏళ్ల బాలిక ఒంగోలు కుర్రాడితో ప్రేమలో పడింది. తన ప్రియుడి కోసం ఒంగోలుకు వచ్చి అనుకోని పరిస్థితిల్లో కొందరు కామాంధులబారిన పడింది. వారు ఆమెను గదిలో బంధించి వారంపాటు అత్యాచారం చేశారు. ఈ ఘటన శనివారం (22వ తేదీ) వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు.. ఒంగోలుకు చెందిన కారు డ్రైవర్ అమ్మిశెట్టి రాము తన వాహనంలో ఇరవై రోజుల క్రితం ఓ రోగిని గుంటూరు వైద్యశాలకు తీసుకెళ్లాడు. అదే సమయంలో తన అమ్మమ్మకు ఆరోగ్యం బాగా లేకపోవడంతో గుంటూరుకు చెందిన ఓ బాలిక (16) ఆస్పత్రికి వచ్చింది.
పోలీసు శాఖలో పొరపాట్లు జరగొద్దు..! జాగ్రత్తగా ఉండాలన్న ఏపి సీఎం..!!
అక్కడ పరిచయం ఏర్పడి.. వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. తర్వాత కొద్ది రోజుల పాటు ఫోన్లో మాట్లాడుకున్నారు. ఈ నేపథ్యంలో రాము కోసం ఈ నెల 16న ఆ బాలిక ఒంగోలు వచ్చేసింది. అయితే అతడి జాడ తెలియకపోవడంతో ఆర్టీసీ ఆవరణలోని ఓ సెల్షాపులో పనిచేసే కుర్రాడిని ఆశ్రయించి రాముకు ఫోన్ చేయాలని కోరింది.ఆ బాలికపై కన్నేసిన సెల్షాపులో పనిచేసే బాజి (దివ్యాంగుడు) ఆమెతో నమ్మకంగా మాట్లాడాడు. రాము కనిపించే వరకు ఇక్కడే ఉండొచ్చని షాపులో ఆశ్రయం కల్పించాడు. అదేరోజు రాత్రి బాలిక నిద్రిస్తున్న సమయంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతటితో ఆగని బాజి మరుసటి రోజు ఆమెను బెదిరించి సుందరయ్యభవన్ రోడ్డులోని తన రూముకు తీసుకెళ్లి అక్కడ ఉంచాడు.
పోలీసులకు దిశానిర్దేశం చేసిన జగన్..! క్రైమ్ రేట్ తగ్గించాలని సలహా..!!
అనంతరం ఒంగోలులోని ఓ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఐదుగురు విద్యార్థులను పిలిపించాడు. బాజితోపాటు వారు కూడా వారంరోజుల పాటు బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. కాగా శనివారం సాయంత్రం ఆ బాలిక ఆర్టీసీ డిపోలో రామును వెతుకులాడే ప్రయత్నంలో ఉండగా.. ఔట్పోస్టు పోలీసులు చూసి ఆమెను ప్రశ్నించారు. దీంతో జరిగిన ఘోరాన్ని వివరించి బోరుమంది. రంగంలోకి దిగిన వన్టౌన్ పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టి. 24 గంటలలో 6గురు నిందితులను పట్టుకున్నారు. ఒంగోలు వన్టౌన్ పోలీసుస్టేషన్లో గ్యాంగ్ రేప్గా కేసు నమోదు చేశారు.