లోకేశ్ నియోజకవర్గం - నిమ్మగడ్డ స్వగ్రామం : ఉత్కంఠగా ఎంపీపీ పోరు : వైసీపీకి ప్రతిష్ఠాత్మకం...!!
ఏపీలో ఈ రోజు ఎంపీపీ ఎన్నిక ప్రక్రియ కొనసాగనుంది. ఇందు కోసం అన్ని రాజకీయ పార్టీలతో పాటుగా..ఎన్నికల సంఘం-అధికారులు సమాయత్తం అయ్యారు. అయితే, ఇప్పుడు కొన్ని ఎంపీపీల ఎన్నిక ప్రధాన పార్టీలకు ప్రతిష్ఠాత్మకంగా మారుతోంది. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నియోజకవర్గం మంగళగిరి పరిధిలోని దుగ్గిరాల మండలం ఎంపీపీ ఎన్నిక రసవత్తంగా మారుతోంది. ఈ మండలానికి మరో ప్రత్యేకత ఉంది. ఎన్నికల కమిషనర్ గా పని చేసిన నిమ్మగడ్డ రమేష్ సొంత మండలం ఇది. తనకు అక్కడి నుంచే ఓటు కావాలని రమేష్ దరఖాస్తు చేయగా.. స్థానిక అధికారులు తిరస్కరించారు.
వైసీపీ - టీడీపీకి ప్రతిష్ఠాత్మకంగా..
దీని పైన ఆయన కోర్టును ఆశ్రయించారు. ఆయన ఎన్నికల కమిషనర్ గా ఉన్న సమయంలో వైసీపీ ప్రభుత్వం వర్సెస్ ఎన్నికల కమిషనర్ గా అన్నట్లుగా పరిణామాలు చోటు చేసుకున్నాయి. మంగళగిరి నియోజవర్గ పరిధిలోకి వచ్చే ఈ మండలంలో మాత్రమే స్థానిక ఎన్నికలు జరిగాయి. మిగిలిన మండలాలు మున్సిపల్ పరిధిలోకి వెళ్లటంతో ఇక్కడ ఎన్నిక జరిగింది. ఈ మండలంలో నామినేషన్ల మొదలు..ఫలితాల వరకూ ప్రతీ అంశంలోనూ ఉత్కంఠ కొనససాగుతూనే ఉంది. ఇప్పుడు మరి కొద్ది గంటల్లో కీలకమైన మండల అధ్యక్ష పదవి కోసం మరింత రసవత్తర సన్నివేశాలు చోటు చేసుకుంటున్నాయి.
నామినేషన్ల నుంచి కౌంటింగ్ దాకా..
నామినేషన్ల సమయంలో దుగ్గిరాల -1 లో టీడీపీ, ఈమని లో జనసేన అభ్యర్ధుల నామినేషన్లు చెల్లవంటూ వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. అయితే, ఆ రెండు పార్టీలకు చెందిన నేతలు ఏకంగా ఎన్నికల సంఘానికి నివేదించటంతో వారి నామినేషన్లు ఆమోదించారు. ఎన్నికల ప్రచారం కొనసాగుతుండగా.. ఊహించని విధంగా దుగ్గిరాల -1, 3 టీడీపీ అభ్యర్దులు తాము అధికార వైసీపీ లో చేరుతున్నట్లుగా ప్రకటించారు. ఇక, ఈ నెల 19న ఓట్ల లెక్కింపు సమయంలోనూ ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకున్నాయి. 63 ఓట్లతో జనసేన అభ్యర్ధి గెలుచుకున్న పెదకొండూరు స్థానంలో రీ కౌంటింగ్ చేయాలంటూ వైసీపీ పట్టుబట్టింది. మరో సారి లెక్కించడగా 39 ఓట్లతో జనసేన అభ్యర్ధి గెలిచినట్లుగా అధికారులు వెల్లడించారు.
ఎన్నిక జరుగుతుందా.. వాయిదా పడుతుందా
మరోసారి వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ..మరలా కౌంటింగ్ చేయాలని పట్టుబట్టింది. దీంతో..మరోసారి కౌంటింగ్ చేయగా..చివరకు జనసేన అభ్యర్ధి 20 ఓట్ల తేడాతో వైసీపీ పైన ఓడిపోయిందని ప్రకటించారు. ఎన్నికల ఫలితాల్లో తెలుగు దేశం 9, వైసీపీ 8, జనసేన 1 ఎంపీటీసీ స్థానాలు గెలుచుకున్నాయి. దుగ్గిరాల ఎంపీపీ పదవి బీసీ మహిళకు కేటాయించారు. దీంతో..టీడీపీ నుంచి గెలిచిన చిలువూరు-1 అభ్యర్ధి షేక్ జబీన్ ఒక్కరే బీసీ అభ్యర్ది కావటంతో..తమకే ఈ ఎంపీపీ దక్కుతుందని టీడీపీ ఆశించింది. అయితే, ఇక్కడే మరో ట్విస్ట్ చోటు చేసుకుంది.
ఎలాగైనా దక్కించుకోవాలనే పట్టుదలతో
షేక్ జబీన్ కు స్థానిక తహసీల్దార్ కుల సర్టిఫికెట్ ఇవ్వక పోవటంతో పాటుగా ధరఖాస్తు తరిస్కరిస్తున్నట్లుగా వెల్లడించారు. దీంతో..టీడీపీ నేతలు జిల్లా కలెక్టర్ ను కలిసి తమ పరిస్థితిని వివరించారు. దీంతో..అసలు ఎన్నిక జరుగుతుందా లేక వాయిదా పడుతుందా అనే టెన్షన్ మూడు పార్టీల నేతల్లో కనిపిస్తోంది. నారా లోకేశ్ ఇన్ ఛార్జ్ గా ఉన్న నియోజకవర్గం కావటంతో ఇక్కడ వైసీపీకి ప్రతిష్ఠాత్మకంగా ఈ ఎన్నిక నిలిచింది. అదే విధంగా.. అమరావతి రాజధాని పరిధిలోకి వచ్చే ప్రాంతంగా..అక్కడ ఖచ్చితంగా ఎంపీపీ నిలబెట్టుకోవాలనేది టీడీపీ పట్టుదలగా కనిపిస్తోంది.
Recommended Video
రాష్ట్ర వ్యాప్తంగా దుగ్గిరాల పైన ఉత్కంఠ..
దీంతో..అసలు ఎన్నిక ఈ రోజు ఉంటుందా లేదా అనేది ఎన్నికల అధికారులు తేల్చాల్సి ఉంది. ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామక్రిష్ణా రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. దీంతో..ఆయనకు వ్యక్తిగతంగా ఈ ఎంపీపీ గెలుచుకోవటం కీలకంగా మారుతోంది. ఈ పరిస్థితుల్లో దుగ్గిరాల ఎంపీపీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఆసక్తి కరంగా మారుతోంది. ఈ మధ్యాహ్నం సమయానికి దుగ్గిరాల ఎంపీపీ ఎన్నిక పైన అధికారులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు... ఎన్నిక జరిగితే ఎవరికి ఈ ఎంపీపీ దక్కుతుందనేది స్పష్టత రానుంది.