వాట్సాప్, ఫేస్ బుక్కుల్లో రాజకీయ ప్రస్తావనా..? జర బద్రం..! సోషల్ మీడియా పై ఈసీ డేగ కన్ను..!!
అమరావతి/హైదరాబాద్ :ఈ సారి అంటే ఇప్పుడు 2019లో జరుగుతున్న సాధారణ ఎన్నికలను సోషల్ మీడియా చాలా వరకు ప్రభావితం చేస్తున్నట్టు తెలుస్తోంది. నచ్చిన పార్టీకి అనుకూలంగా కామెంట్లు, నచ్చని పార్టీకి వ్యతిరేకంగా పోస్టులు సోషల్ మీడియాలో చక్కర్టు కొడుతున్నాయి. అంతే కాకుండా పలానా పార్టీకే ఒటెయ్యండంటూ సూచనలు కూడా చేస్తున్నారు కొంత మంది పార్టీ అభిమానులు. ఇంతవరకూ కథ బాగానే ఉంది గాని ఇలాంటి పోస్టుల పట్ల ఎవరైనా అభ్యంతరం చెప్తేనే ఇబ్బందులు వచ్చి పడతాయి. మీరు సోషల్ మీడియాలో ఎలాంటి ప్రస్తావనలు చేస్తున్నారో ఎలక్షన్ కమీషన్ నిఘా పెడుతోంది. అభ్యంతరకర పోస్టులు పెడితే చట్ట రీత్యా ఇబ్బందులు తప్పవని హెచ్చరిస్తోంది.
ఎన్నికల వేళ ప్రమాదంగా మారిన ప్రచారం..! పార్టీలు, అభ్యర్థులకు నోటీసులు..!!
రాజకీయ ప్రచారానికి వేదికగా మారిన సోషల్ మీడియాపై ఎన్నికల సంఘం దృష్టిసారించింది. వివిధ పార్టీల నేతల మధ్య విమర్శలు-ప్రతివిమర్శలతో మాటల యుద్ధం తీవ్ర మవుతోంది. అయితే సోషల్ మీడియాను కూడా ఎన్నికల కోడ్ పరిధిలోకి తీసుకురావడంతో రోజూ వందల కొద్దీ సోషల్ మీడియా ఫిర్యాదులో అందుతున్నాయి. దీంతో గాడితప్పి కొనసాగుతున్న ప్రచారాన్ని గుర్తించి పార్టీలు, అభ్యర్థులకు ఈసీ నోటీసులు పంపుతోంది.
2019లో విస్త్రుత ప్రచారంలో కి సోషల్ మీడియా..! వేలల్లో అందుతున్న ఫిర్యాదులు..!!
2014 ఎన్నికలపై సోషల్ మీడియా ప్రభావం అంతగా లేదు. సోషల్ మీడియాను ఎన్నికల కోడ్ పరిధిలోకి ఎన్నికల కమిషన్ తీసుకురాలేదు. 2019కి సోషల్ మీడియా విస్తృతి పెరగడంతో రాజకీయ పార్టీలు దీనిని ప్రచారాస్త్రంగా మార్చుకున్నాయి. పార్టీలు, అభ్యర్థులతో పాటు, సామాన్యులు సోషల్ మీడియాలో ఆయా పార్టీలకు అనుకూలంగానో, వ్యతిరేకంగానో పోస్టింగ్లు పెడుతుంటారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాను ఎన్నికల కోడ్ పరిధిలోకి కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకొచ్చింది. సోషల్ మీడియాలో పోస్టింగులన్నీ కోడ్ పరిధిలోకి వస్తాయా? రావా? అనే అంశాన్ని నిగ్గుతేల్చడానికి ఈసీ కూడా ప్రత్యేకంగా రాష్ట్రస్థాయిలో సోషల్ మీడియా మానిటరింగ్ సెల్ను ఏర్పాటు చేసింది.
సిబ్బంది తలమునకలు..! ఎన్నని పరిష్కరిస్తారు..!!
సోషల్ మీడియాలో వచ్చే ఏ అంశం ఎన్నికల సంఘం పరిధిలోకి వస్తుంది? ఏ అంశం రాదు? అనే పరిశీలనలో ఎన్నికల సిబ్బంది తలమునకలవుతున్నారు. వీటితోపాటు సోషల్ మీడియాలో ప్రచారాలపై ఆయా పార్టీలు ఈసీకి వందల సంఖ్యలో ఫిర్యాదులు చేస్తున్నాయి. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాపై వచ్చే ఫిర్యాదులు కన్నా ఈసీకి సోషల్ మీడియాపై వచ్చే ఫిర్యాదులే ఎక్కువగా ఉన్నాయని ఎన్నికల సిబ్బంది అంటున్నారు. వీటి పరిశీలనకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తోందంటున్నారు. సోషల్ మీడియాలో ప్రత్యర్థి పార్టీల క్లిప్పింగ్స్ను ఈసీకి అందజేస్తున్నాయి పలు పార్టీలు.
గెలుపోటముల్లో ముస్లింలే కీలకం.. దక్కుతున్నది అంతంతమాత్రం ప్రాధాన్యం
సోషల్ మీడియా అకౌంట్స్ వివరాలూ ఇవ్వాలి..! కొత్త నిబందన అమల్లోకి తెచ్చిన ఈసి..!!
అభ్యర్థులు కూడా నామినేషన్ల వేసే సమయంలోనే అభ్యర్థులు కూడా వారి సోషల్ మీడియా అకౌంట్స్ వివరాలు కూడా ఇవ్వాలని ఎన్నికల కమిషన్ నిబంధన విధించింది. నామినేషన్ వేసిన తర్వాత రోజు నుంచి వారి అకౌంట్స్ను కూడా ఎన్నికల సోషల్ మీడియా టీం పర్యవేక్షిస్తోంది. ప్రతి జిల్లాలో సోషల్ మీడియా మానిటరింగ్ కోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. అభ్యర్థుల సోషల్ మీడియా ఖాతాల పర్యవేక్షణకు ప్రతి నియోజకవర్గానికి ఒక సోషల్ మీడియా పర్యవేక్షకుడిని ఎన్నికల సంఘం నియమించబోతోంది. ఎన్నికల కమిషన్ సోషల్ మీడియాలో ఆయా పార్టీల అభ్యర్థుల ప్రచారాన్ని గుర్తించి ఖర్చును వారి ఖాతాలో జమ చేయాల్సి ఉంటుందని చెప్తున్నారు.