తొలిసారిగా సీఎం జగన్ - పవన్ ముఖాముఖి : చంద్రబాబు అక్కడే..!?
ఒకే వేదిక మీదకు సీఎం జగన్, చంద్రబాబు, పవన్. తొలి సారిగా జగన్..పవన్ ముఖాముఖి ఆసక్తి కరంగా మారుతోంది.
ఏపీ రాజకీయాల్లో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. వచ్చే ఎన్నికలకు సిద్దం అవుతున్న వేళ ప్రధాన పార్టీ నేతల మధ్య పొలిటికల్ వార్ హీటెక్కింది. సీఎం జగన్ లక్ష్యంగా ఇప్పుడు చంద్రబాబు - పవన్ ఒక్కటవుతున్నారు. రెండు పార్టీల మధ్య పొత్తు దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. ఇదే సమయంలో ఇప్పుడు ఈ ముగ్గురు నేతలు ఒకే వేదిక మీదకు వస్తున్నారు. న్యాయమూర్తులు..అధికారుల సమక్షంలోకి ఈ ముగ్గురూ ప్రత్యేకార్షణగా నిలవబోతున్నారు. సీఎం జగన్ - పవన్ ముఖాముఖి ఇదే తొలి సారి. అక్కడే చంద్రబాబు ఉంటుండటంతో ఈ సమావేశం పైన ఆసక్తి నెలకొని ఉంది.
రిపబ్లిక్ డే సందర్భంగా గవర్నర్ బిశ్వభూషణ్ రాజ్ భవన్ లో అట్ హోం ఏర్పాటు చేసారు. అన్ని పార్టీల అధినేతలను ఆహ్వానించారు. హైకోర్టు న్యాయమూర్తులతో పాటుగా ప్రభుత్వ అధికారులు.. ప్రముఖులు రాజ్ భవన్ లో జరిగే తేనేటి విందుకు హాజరు కానున్నారు. రాజ్ భవన్ కు సీఎం జగన్ - భారతి దంపతులు హాజరు కానున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు..జనసేనాని పవన్ కు రాజ్ భవన్ నుంచి ఆహ్వానాలు అందాయి. చంద్రబాబు గత ఏడాది అట్ హోం కు హాజరయ్యారు.
అయితే, అదే కార్యక్రమంలో సీఎం జగన్ హాజరయ్యారు. కానీ, సీఎం జగన్ - చంద్రబాబు ఎదురుపడలేదు. ఇక, ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో మూడు పార్టీల నేతలు వేడి పెంచుతున్న సమయంలో ఒకే చోటకు వస్తున్నారు. సీఎం జగన్ ఇద్దరు నేతలు చంద్రబాబు - పవన్ ను కలుస్తారా.. ఈ ఇద్దరు అందుకు సిద్దంగా ఉన్నారా అనేది ఆసక్తి పెంచుతోంది.
పవన్ కల్యాణ్ విజయవాడలోనే ఉన్నారు. ఆయన పార్టీ కార్యాలయంలో జరిగే రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొన్న తరువా పార్టీ నేతలతో సమావేశం ఏర్పాటు చేసారు. గత ఏడాది రాజ్ భవన్ నుంచి ఆహ్వానం ఉన్నా అట్ హోం కార్యక్రమానికి హాజరు కాలేదు. ఈ సారి హాజరయ్యే అవకాశం ఉందని జనసేన నేతలు చెబుతున్నారు. సీఎం జగన్ హాజరు ఖరారైంది.
చంద్రబాబు పార్టీ నేతలతో సమావేశం కానున్నారు. రేపటి నుంచి కుప్పం వేదికగా ప్రారంభం కానున్న లోకేష్ పాదయాత్ర పైన సమీక్ష చేయనున్నారు. గతంలో తెలంగాణ రాజ్ భవన్ లో జరిగిన అట్ హోం కార్యక్రమానికి పవన్ హాజరయ్యారు. ఇప్పుడు ఏపీలో జరిగే కార్యక్రమానికి వస్తారా లేదా అనే సందిగ్ధత కొనసాగుతోంది. సీఎం జగన్ - పవన్ ముఖాముఖి కలిస్తే ఇద్దరూ ఏ రకంగా రియాక్ట్ అవుతారనేది ఆసక్తిని పెంచుతోంది.