జగన్ కు పెద్ద ఝలక్! : టీడీపీలోకి ధర్మాన?!
విజయవాడ : పుష్కరాల సీజన్ తో పార్టీ ఫిరాయింపులకు కాస్త బ్రేక్ పడ్డట్లే కనిపించినా..! పుష్కరాలు ముగిసిన నేపథ్యంలో ఫిరాయింపుల పర్వం మళ్లీ మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. అధికార పార్టీ ఆకర్ష్ మంత్రనో.. లేక సొంత నిర్ణయమో తెలియదు గానీ మొత్తానికి వైసీపీ నేత ధర్మాన ప్రసాదరావు పార్టీ ఫిరాయించడం ఖాయమే అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.
వైసీపీని టార్గెట్ చేసేలా.. ధర్మాన ప్రసాదరావు చేసిన తాజా కామెంట్స్ ఈ ఫిరాయింపు వార్తలకు ఊతమిచ్చేవిగా మారాయి. ఇంతకీ ఆయనేం చెప్పారంటే.. 'కడపలో కాబట్టి జగన్ నెగ్గగలుగుతున్నాడు గానీ శ్రీకాకుళంలో ఆయన కూడా నెగ్గలేడని, తానే గనుక టీడీపీ తరుపున బరిలోకి దిగి ఉంటే.. ఎమ్మెల్యేగా గెలిచుండేవాడిని' అన్నారు.
ఈ కామెంట్స్ ను బట్టి ధర్మాన రాజకీయ చూపు టీడీపీ వైపు మళ్లుతోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్ సీఎంగా ఉన్న కాలంలో మంత్రిగా పనిచేసిన ధర్మాన, ఆ తర్వాతి కాలంలో కిరణ్ కుమార్ రెడ్డకీ విశ్వాసపాత్రుడిగానే ఉన్నారు. అయితే వైఎస్ మరణం తర్వాత సొంత పార్టీ పెట్టుకున్న జగన్ ను టార్గెట్ చేస్తూ.. చాలాసార్లు ఆయనపై ఫైర్ అయ్యాడు ధర్మాన. జగన్ కేసుల్లో తాను కూడా ఇరికేవరకు ధర్మాన వ్యవహారమంతా జగన్ ను టార్గెట్ చేస్తూనే వచ్చింది.
అనంతరం జగన్ కేసుల్లో సీబీఐ తననూ వెంటాడంతో.. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలక రాజకీయాలకు ధర్మాన కాస్త దూరంగా జరిగారు. ఇదే క్రమంలో.. గత ఎన్నికల నాటికి జగన్ కు దగ్గరైన ఆయన వైసీపీ గూటికి చేరిన సంగతి తెలిసిందే. అయితే జగన్ మాత్రం ధర్మానకు పార్టీలో అంతగా ప్రాధాన్యం ఇవ్వకపోతుండడంతో.. ధర్మానలో అసంత్రుప్తి పేరుకుపోయినట్లుగా తెలుస్తోంది. పైగా.. ఇటీవల శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష పదవిని తనకు కాకుండా రెడ్డి శాంతికి కట్టబెట్టడంతో.. ఆయనలో అసంత్రుప్తి తారాస్థాయికి చేరుకున్నట్లుగా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలోనే.. ఇక వైసీపీతో తెగదెంపులకు ధర్మాన సిద్దమవుతున్నారన్న ఊహాగానాలు తెరపైకి వస్తున్నాయి. అదీగాక.. అధికార పార్టీలో చేరితే సీబీఐ కేసుల నుంచి కూడా ఊరట కలగవచ్చే భావనలో ధర్మాన ఉన్నారేమో అన్న వాదన కూడా వినిపిస్తోంది. అయితే జగన్ కేసుల్లో నిందితుడిగా ఉన్న ధర్మానను చేర్చుకోవడం.. టీడీపీ కలిసొచ్చే విషయమా? పార్టీకి నష్టం చేకూర్చే విషయమా? అన్న ప్రశ్న టీడీపీ వర్గాల్లోను మొదలవవచ్చు. ఇలాంటి తరుణంలో.. ధర్మాన చేరికకు టీడీపీ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా..? టీడీపీలో ఎంట్రీ కోసం ఆ పార్టీ ఎంట్రెన్స్ దగ్గర ధర్మాన నిలబడుతారా..? అన్న అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.