ఏపీలో ఎన్నికల వేడి మొదలైనట్టేనా..
ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల వేడి మొదలైంది. ఏ పార్టీకి సంబందించిన నేతలు ఆ పార్టీ నాయకులను కలుపుకుని బహిరంగ సమావేశాలు, పాదయాత్రలు, బస్సు యాత్రలు నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ప్రజలకు ఏ పార్టీ ఏ మేరకు ద్రోహం చేసిందో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వైసీపి ఎంపీల రాజీనామాలు జూన్ 6న ఆమోదం పొందితే కీలక పరిణామలు చోటుచేసుకునే అవకాశాలు ఉన్నాయి.
బీజేపి ని ప్రధాన శత్రువుగా అభివర్ణిస్తూ వైసీపి ప్రధాన్యతను తగ్గించే ప్రయత్నం..
ఆంధ్ర ప్రదేశ్ లో ఎలక్షన్ హీట్ మొదలైపోయింది. ప్రధాన పార్టీల నాయకులు అప్పుడే 2019 కురుక్షేత్రం కోసం కార్యక్షేత్రంలోకి దిగిపోయారు. ధర్మధీక్షల పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు బీజేపీ పై యుద్ధం ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో తన ప్రత్యర్థి బీజేపీ అని ఆయన డిసైడ్ అయిపోయారు. బాబు లెక్కల్లో ఓ క్యాలిక్యులేషన్ ఉందని చెప్పొచ్చు. తన ప్రత్యర్థి బీజేపీనే అని చెప్పడం ద్వారా ఆయన జగన్ ను చిన్నవాడిగా చేసి చూపుతున్నారు. జగన్ న్ను బీజేపీలో పార్ట్ అండ్ పార్సిల్ గా టీడీపీ చూస్తోంది. కొత్త జెండా ఎత్తుకొని బయలుదేరిన పవన్ కల్యాణ్ వెనుక కూడా బీజేపీనే ఉందన్నది టీడీపీ సందేహం. ఇక జగన్ ఎప్పుడో రోడ్డెక్కేశారు. పాదయాత్రతో ఇప్పటికే సగం రాష్ట్రాన్ని చుట్టేశారు. తన పార్టీకి వ్యూహకర్తగా పీకేను నియమించుకున్నారు. ఇలా ఏపీ మొత్తం ఎలక్షన్ ఫీవర్ మొదలైపోయింది.
వైసీపి ఎంపీల రాజీనామాల ఆమోదం కీలకం కానున్నాయి.. జూన్ 6న ఉత్కంఠ కు తెర..
2019లో అక్కడ ఏం జరగబోతోంది ? టీడీపీ తిరిగి అధికారాన్ని నిలబెట్టుకుంటుందా ? లేక వైసీపీ కి అదృష్టం పండుతుందా ? మధ్యలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ పాత్రేంటి ? లాంటి ప్రశ్నలు బయలుదేరాయి. ఏపీ ఎవరిది అని తేల్చుకోవడానికి 2019 వరకు ఆగాల్సిన అవసరం లేదేమోననిపిస్తోంది. తాజాగా వైసీపీ ఎంపీల రాజీనామా వ్యవహారం తేలిపోతే సాధారణ ఎన్నికల కంటే ముందే ఏపీ భవితవ్యం తేలిపోతుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. వైసీపీ నుంచి ఫిరాయించిన లేదా ఆ పార్టీకి దూరంగా ఉంటోన్న ఎంపీల సంగతి కాసేపు పక్కన పెడితే ప్రస్తుతం అయిదుగురు ఎంపీలు జగన్ తో ఉన్నారు.
వైసీపి ఎంపీల రాజీనామాలతో ఉప ఎన్నికలు వస్తే ఎవరికి లాభం...
చిత్తూరు, రాజంపేట, ఒంగోలు, నెల్లూరు, కడప ఎంపీలు వైసీపీతో ఉన్నారు. ప్రత్యేక హోదా పేరుతో ఈ అయిదుగురు రాజీనామాలు సమర్పించారు. జూన్ అయిదు లేదా ఆరు తేదీల్లో ఈ రాజీనామాలు ఆమోదం పొందేదీ లేనిది తేలిపోతుంది. వాటికి ఆమోదం లభించినా ఉప ఎన్నికలు రావచ్చు రాకపోవచ్చు. సాధారణ ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం కూడా లేదు కనుక ఎలక్షన్ పెండింగ్ లో పెట్టే అవకాశం లేకపోలేదు. కాదు... ఎన్నికలు పెట్టినా పెట్టవచ్చు! ఒకవేళ ఎన్నికలంటూ జరిగితే అవి 2019కి ఫ్రీ పైనల్స్ కిందే లెక్క. అప్పుడు ఎవరి లెక్క ఏమిటో తేలిపోతుంది. ఉప ఎన్నికలు అధికార పక్షానికి ఎప్పుడూ కాస్త అనుకూలంగానే ఉంటాయి. అందులోనూ చంద్రబాబు ఎలక్షన్ మేనేజ్ మెంట్ డిఫరెంట్ గా ఉంటుంది. ఆ మధ్య నంద్యాల ఉప ఎన్నిక విషయంలో ఈ విషయం స్పష్టమైంది.
ఉపపోరులో టీడిపి పైచేయి సాధించకపోతే 2019 ఎన్నికల్లో గడ్డు పరిస్థితులే...
ఈ నేపథ్యంలో అయిదు ఎంపీ స్థానాలకు ఉప ఎన్నికలు వస్తే వైసీపీకి అగ్ని పరీక్ష కిందే లెక్క. అందులో ఏ ఒక్క స్థానం కోల్పోయినా ఆ పార్టీ సిట్టింగ్ సీటును కోల్పోయినట్టవుతుంది. భారీ మెజారిటీలతో అన్ని స్థానాలు తిరిగి గెలిస్తే 2019 టీడీపీకి గడ్డుకాలమేనని ముందే స్పష్టమవుతుంది. అయితే, ఉప ఎన్నికలంటూ వస్తే గెలుపు పై టీడీపీ చాలా ధీమాగా ఉంది. కనీసం రెండు నుంచి మూడు స్థానాలు గెలుస్తామని ఆ పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. ఒంగోలు, నెల్లూరు ఖాయంగా గెలుస్తామన్నది టీడీపీ అంచనా. చిత్తూరు కూడా ఛాన్స్ ఉంటుందంటున్నారు. రాజంపేట, కడప మాత్రం వైసీపీకే ఖాయం. ఉప ఎన్నికలంటూ వస్తే పార్టీల మధ్య ప్రకటిత, అప్రకటిత పొత్తుల వ్యవహారంపైన కూడా క్లారిటీ వస్తుంది. జనసేన పోటీ చేస్తుందా లేదా అన్నది మరో ఆసక్తికర కోణం. వైసీపీకి బీజేపీ ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సహకరించే అవకాశం ఉంటుంది. ఇటీవల కర్నాటక అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కోసం వైసీపీ పని చేసిన దాఖలాలు ఉన్నాయి. సో... ఉప ఎన్నికలంటూ వస్తే... 2019 కంటే ముందే ఏపీ పొలిటికల్ భవిష్యత్ తేలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది.